జమ్మూకశ్మీర్‌లో ఉపాధ్యాయురాలిని కాల్చి చంపిన ఉగ్రవాదులు

- May 31, 2022 , by Maagulf
జమ్మూకశ్మీర్‌లో ఉపాధ్యాయురాలిని కాల్చి చంపిన ఉగ్రవాదులు

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ హిందూ కుటుంబానికి చెందిన ఉపాధ్యాయురాలిని కాల్చి చంపారు.దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా గోపాలపొర ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది.జమ్ము డివిజన్‌లోని సాంబాకి వలస వచ్చిన ఆమె ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.సమాచారం అందుకున్న వెంటనే భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించారు.

ఈ ఘటనపై స్పందించిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ‘ఇది చాలా విచారకరమని’ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. కశ్మీర్‌లో లక్షిత పౌరహత్యలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

లోయలో ఇటీవల చెలరేగిపోతున్న ఉగ్రవాదులు ఈ నెల 12న బుద్గాంలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి అయిన రాహుల్ భట్‌ను కాల్చి చంపారు. గత వారం ఓ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్‌ను లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. తాజాగా, ఇప్పుడు ఉపాధ్యాయురాలిని హత్య చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com