శాంతితోనే ప్రగతి సాధ్యం: ఉపరాష్ట్రపతి

- June 15, 2022 , by Maagulf
శాంతితోనే ప్రగతి సాధ్యం: ఉపరాష్ట్రపతి

న్యూ ఢిల్లీ: పరస్పర సమన్వయం, సహనమే భారతీయ జీవన విధానమని భారత ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.శాంతియుతమైన వాతావరణం నెలకొన్నప్పుడే దేశ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. మొదట్నుంచీ భారతదేశంలో మతాలకు అతీతంగా అందరికీ సమానమైన అవకాశాలొచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. కుల, మతాల ప్రాతిపదికన దేశాన్ని విభజించేందుకు జరుగుతున్న కుట్రలను ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా అడ్డుకోవాలన్నారు. 

బుధవారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణంలో ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెమొక్రటిక్ లీడర్‌షిప్’ విద్యార్థులతో సంభాషించిన ఉపరాష్ట్రపతి, రాజకీయాలు పవిత్రమైన వృత్తి అని.. ఇందులో రాణించాలంటే క్రమశిక్షణతోపాటు అంకితభావం కలిగుండాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతన్న ఉపరాష్ట్రపతి రాజకీయ నాయకులతోపాటు ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలన్నారు.

ప్రజాజీవితంలోకి రావాలనుకునేవారు క్రమశిక్షణతోపాటు దేశం కోసం, మన ప్రాంత ప్రజల కోసం మంచిచేయాలన్న తపన, అన్ని అంశాలను సహనంగా వినడం, విమర్శల్లోని సానుకూల అంశాలను స్వీకరించడం, ప్రజాభిప్రాయాన్ని అంగీకరించడం నేర్చుకోవాలన్నారు. ఇష్టపడిన ఏ విషయంలోనైనా కష్టపడి పనిచేస్తే నష్టపోయేది ఉండదని ఉపరాష్ట్రపతి సూచించారు.
విద్యార్థి రాజకీయాలతో ప్రారంభమై ఆ తర్వాత ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా ప్రజాజీవితంలో, తదనంతరం భారత ఉపరాష్ట్రపతిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ప్రజలతో మమేకమైన సందర్భాల్లో తనకు ఎదురైన అనుభవాలు వాటినుంచి నేర్చుకున్న పాఠాలను ఉపరాష్ట్రపతి క్లుప్తంగా విద్యార్థులకు వివరించారు. ప్రముఖ నాయకులు, మేధావులు, రాజ్యాంగ నిపుణుల ప్రసంగాలను వినడం, వారి రచనలను చదవడం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ఈ జ్ఞానానికి కష్టపడి, చిత్తశుద్ధితో పనిచేయడం తోడైతే రాజకీయాల్లో రాణించగలమన్నారు.

తను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అసెంబ్లీకి ఉదయం తొందరగానే చేరుకుని అసెంబ్లీ లైబ్రరీలోని గతంలో అసెంబ్లీలోని ప్రముఖులు చేసిన ప్రసంగాలను చదివేవారమని గుర్తుచేసిన ఉపరాష్ట్రపతి, రాజకీయాల్లో బృందస్ఫూర్తితో పనిచేయడం, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సమస్యలపై అవగాహన, వాటికోసం పోరాడటం ద్వారా నిత్యం ప్రజలతో మమేకమై ఉండాలన్నారు.

రాజ్యసభ చైర్మన్ గా సభాకార్యక్రమాలు సజావుగా జరిగేందుకు తనవంతు కృషిచేశానని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. అందరు సభ్యులకు సమానమైన అవకాశాన్ని ఇస్తూ.. ఆయా ప్రాంతాల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం పనిచేశానన్నారు. దీంతోపాటుగా 22 భారతీయ భాషల్లో రాజ్యసభ సభ్యులు మాట్లాడేందుకు వీలుగా తీసుకున్న నిర్ణయం తనకెంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు.

భారతదేశంలో ఇటీవలి కాలంలో సేంద్రీయ వ్యవసాయంపై ఆసక్తి పెరగడం శుభపరిణామం అన్న ఉపరాష్ట్రపతి, ఈ దిశగా మరింత పురోగతి జరగాలన్నారు. దేశానికి ఆహార భద్రత అసరమని అయితే పౌష్టికాహార భద్రతను కల్పించనపుడు ఆరోగ్యకరమైన భారత్ తద్వారా సంక్షేమ భారత నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ దిశగా సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహంతోపాటు ఈ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ వసతులు కల్పించినపుడు ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో రాంభావు మాల్గి ప్రబోధిని సంస్థకు చెందిన ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెమొక్రటిక్ లీడర్‌షిప్’ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com