'పక్కా కమర్షియల్' ప్రీ రిలీజ్ ఈవెంట్

- June 27, 2022 , by Maagulf
\'పక్కా కమర్షియల్\' ప్రీ రిలీజ్ ఈవెంట్

హైదరాబాద్‌: గోపీచంద్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్.ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశారు.మెగాస్టార్ చిరంజీవి చీఫ్‌ గెస్టుగా విచ్చేశారు.హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కన్నుల పండుగగా జరిగింది.ఈ సినిమా జులై 1న ప్రేక్షకుల ముందుకురానుంది.గల్ఫ్ లో ఈ సినిమాని వరల్డ్ వైడ్ ఫిలిమ్స్ ద్వారా విడుదల కానుంది. 

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ''నేను ఈ ఫంక్షన్‌కు వచ్చింది మీ కోసమే (అభిమానులు, ప్రేక్షకులు). ఇక్కడ నుంచి మీరందించే ప్రోత్సాహం, ఉత్సాహాన్ని నేను తీసుకెళ్తా. అవే నన్ను నడిపించే ఇంధనాలు. 'పక్కా కమర్షియల్‌' టీమ్‌తో నాకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. ఇక్కడికి వచ్చినందుకు.. నాకూ గోపీచంద్‌కు ఉన్న సంబంధమేంటోనని మీలో చాలా మంది అనుకోవచ్చు.గోపీచంద్‌ నాన్న టి. కృష్ణ బీకామ్‌ ఫైనలియర్‌ చదువుతున్నప్పుడు అదే (సీఎస్‌ఆర్‌ శర్మ కాలేజీ- ఒంగోలు) కాలేజీలో నేను ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌. ఆ కాలేజీలో కొత్తగా చేరిన నన్ను సీనియర్లు ఆయన దగ్గరకు తీసుకెళ్లారు. భయపడుతున్న నన్ను చూసి, 'స్టూడెంట్‌ ఫెడరేషన్‌కు నేను లీడర్‌గా నిలబడుతున్నా నీ సహకారం మాకు కావాలి' అని కృష్ణ అడిగారు. నాకెంతో భరోసానిచ్చిన ఆయన ఎప్పుడూ హీరోలానే కనిపిస్తారు. అనుకోకుండా ఇద్దరం చిత్ర పరిశ్రమకు వచ్చాం. కానీ, కలిసి సినిమా చేసే అవకాశం రాలేదు.సందేశాత్మక, విప్లవాత్మక చిత్రాలు తెరకెక్కించిన ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన పరంపరను గోపీచంద్‌ కొనసాగించడం చాలా సంతోషంగా ఉంది. గోపీచంద్‌ సినిమాల్లో నాకు 'సాహసం' అంటే బాగా ఇష్టం. 'ఒక్కడున్నాడు', 'చాణక్య' వంటి వైవిధ్య భరిత కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటాడు. ప్రజారాజ్యం పార్టీ జెండా డిజైన్‌ కోసం మంచి ఆర్టిస్ట్‌ను అన్వేషిస్తుంటే మారుతి పేరును ఎవరో సూచించారు. నా ఆలోచనలు ఆయనతో పంచుకున్నా. తను చేసిన డిజైన్‌ నాకు బాగా నచ్చింది. ఆ పార్టీ కోసం ఓ పాటనూ రూపొందించాం. దానికి విజువల్స్‌ షూట్‌ చేసుకురమ్మని అడగ్గా 'నేను చేయగలనంటారా' అని మారుతి సందేహించారు. చేయగలవు అని నేను కెమెరా ఇచ్చి ఆయన్ను షూట్‌కు పంపించా. ఆ విజువల్స్‌ చూసి ఆశ్చర్యపోయా. అప్పుడే ఆయనలో దర్శకుడు ఉన్నాడని చెప్పా. తన చిత్రాల్లో 'ప్రేమకథా చిత్రమ్‌' నాకు బాగా ఇష్టం. 'పక్కా కమర్షియల్‌' సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా. ఆయనతో సినిమా చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా'' అని చిరంజీవి తెలిపారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ''ఈరోజు నాకెంతో ప్రత్యేకం. ఒకింత భావోద్వేగంతో కూడుకున్నది. ఎందుకంటే.. నేను ఒకప్పుడు బందరు (మచిలీపట్నం)లో బొమ్మలేసే ఆర్టిస్టుని. అలా చిరంజీవి బొమ్మలు, బ్యానర్లు రాసుకునే నేను దర్శకుడిగా మారడం, నా సినిమా వేడుకకు ఆయన అతిథిగా రావడం మామూలు విషయం కాదు. చిరంజీవి అంటే నాకు పిచ్చి. ఆయన సినిమాలన్నీ చూసేవాడ్ని. నేను చిత్ర పరిశ్రమలోకి రాకముందు ఆయన్ను కలిసినట్టు ఓ కల వచ్చింది. కట్‌ చేస్తే, ప్రజారాజ్యం పార్టీకి సంబంధించిన యాడ్స్‌ చేసే సమయంలో నా కల నిజమైంది. అనుకోకుండా అదే సమయంలో పార్టీ యాడ్‌ కోసం చిరంజీవి నటిస్తాననగా దానికి 'యాక్షన్‌' నేనే చెప్పా. ఆ సర్‌ప్రైజ్‌కు షాక్‌ అయ్యా.నేనసలు దర్శకుడికావాలని ఎప్పుడూ అనుకోలేదు. 'నీలో డైరెక్టర్‌ ఉన్నాడు చూస్కో' అని చిరంజీవి అనడం వల్లే నేనిలా మీ ముందున్నా. ఆయన కోసమైనా డైరెక్టర్‌ను కావాలనుకుని 'ఈరోజుల్లో' కథ రాశా. అక్కడి నుంచి నా ప్రయాణం గురించి మీకు తెలిసిందే. చిరంజీవిగారు మంచి నటుడేకాదు మంచి మనసున్న వ్యక్తి. ప్రస్తుతం చిన్న నటులనే కలవడం కష్టం అలాంటిది ఆయన ఇంటి గేటు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఆయనెంత బిజీగా ఉన్న మాలాంటి వారిని ఆశీర్వదించేందుకు ఇలాంటి వేడుకలకు వస్తుంటారు'' అని మారుతి పేర్కొన్నారు.

గోపీచంద్‌ మాట్లాడుతూ..''నేను ఇన్నేళ్లు అయింది సినిమా ఇండస్ట్రీకి వచ్చి.. నా ఫంక్షన్‌కు చిరంజీవిగారు ఎప్పుడూ రాలేదు. మొదటిసారి పిలవగానే వచ్చారు.మెగాస్టార్‌ చిరంజీవి కి ధన్యవాదాలు. ఈ రోజు యాక్షన్‌ సినిమాల్లో టెక్నిక్‌ ఉంది. ఆ రోజుల్లో మీరు(చిరంజీవి) సినిమాలు చేసేటప్పడు ఆ టెక్నిక్‌ లేదు. కొన్ని సినిమాల్లో చాలా రిస్క్‌ చేశారు. మీరు చేసిన ఆ రిస్క్‌ షాట్‌లు మీము ఇప్పుడు అంత సులభంగా చేయలేం. ఆ రోజుల్లో మీరు ధైర్యంగా చాలా సినిమాలు చేశారు. మీరు ఒక స్ఫూర్తి. ఏ తోడు, బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేను సాధిస్తాను అని ఒక పట్టుదలతో, కసితో ఈ రోజు ఒక మహావృక్షం లాగా ఇండస్ట్రీలో నిలబడ్డారు. మిమ్మల్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని యూత్‌ ఈ రోజు ఇండస్ట్రీకి వస్తున్నారు అని చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడారు. ''మారుతి తనకున్న ప్రతిభతో ఈ సినిమా తర్వాత చాలా పెద్దస్థాయి డైరెక్టర్‌ అవుతారు. ఈ చిత్రంలో రాశీకన్నాకు మంచి పాత్ర లభించింది. తన కెరీర్‌లో ఇదే బెస్ట్‌ క్యారెక్టర్‌ అనుకుంటున్నాను. అద్భుతంగా నటించింది. అరవింద్‌ బ్యానర్‌లో సినిమా చేయడానికి ఇన్నేళ్లు పట్టింది'' అని గోపీచంద్‌ అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ.. ''చిరంజీవి నాకెప్పుడు సినిమా అవకాశమిస్తారోనని వేచి చూస్తున్నా.'పక్కా కమర్షియల్‌'లో మారుతి మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కచ్చితంగా ఉంటుంది.చాలాకాలం తర్వాత గోపీచంద్‌ యాక్షన్‌+ ఫన్‌ మిక్స్‌ అయిన పాత్రలో నటించాడు.రాశీఖన్నా ఎప్పటిలానే సందడి చేయబోతుంది.ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది'' అని దిల్‌రాజు అన్నారు.వీరితోపాటు ఈ కార్యక్రమంలో నాయిక రాశీఖన్నా, అల్లు అరవింద్‌, రావు రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com