యూఏఈకి భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు..

- August 20, 2022 , by Maagulf
యూఏఈకి భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు..

యూఏఈ నుంచి వేసవి సెలవుల కోసం స్వదేశానికి వచ్చిన భారత ప్రవాసులకు తిరిగి వెళ్లేందుకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆకాశాన్నంటిన విమాన టికెట్ల ధరలతో ప్రవాసులు బెంబెలేత్తిపోతున్నారు. దీనికితోడు ప్రస్తుతం భారత్ నుంచి యూఏఈకి వెళ్లే ప్రయాణికులు బాగా పెరగడంతో విమాన టికెట్లు దొరకడం లేదు. ఇలా రెండువైపుల నుంచి ప్రవాసులకు యూఏఈ రిటర్న్ జర్నీ చుక్కలు చూపిస్తోంది. దాంతో ప్రవాసులు మధ్యేమార్గంగా ముందు జీసీసీ దేశాలకు చేరుకుని ఆ తర్వాత అక్కడి నుంచి కనెక్టింగ్ విమానాల ద్వారా యూఏఈకి వెళ్తున్నారు. చాలామంది భారతీయ వాసులు ప్రస్తుతం జీసీసీ దేశాలైన ఖతార్, బహ్రెయిన్, కువైత్‌కు వెళ్లి అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్‌లో దుబాయ్‌ తో పాటు యూఏఈలోని ఇతర నగరాలకు చేరుకుంటున్నారని ప్లూటో ట్రావెల్స్ మేనేజింగ్ పార్ట్నర్ భరత్ ఐదసాని తెలిపారు. దీనికి కారణం భారత్ నుంచి యూఏఈకి ఉన్న డైరెక్ట్ విమాన టికెట్ ధరల కంటే కూడా కనెక్టింగ్ ఫ్లైట్స్ టికెట్ రేట్లు తక్కువగా ఉండడమే కారణమని పేర్కొన్నారు. అంతేగాక జీసీసీ దేశాల నుంచి యూఏఈలోని గమ్యస్థానాలకు విరివిగా విమాన సర్వీసులు (Flight Services) ఉండడం కూడా మరో కారణమని ఆయన చెప్పారు. అటు ఇండియా నుంచి జీసీసీ దేశాలకు జర్నీ సమయం కూడా నాలుగు గంటలేనని భరత్ ఐదసాని చెప్పుకొచ్చారు. ఈ కారణాలతోనే ప్రవాసులు జీసీసీ దేశాల ద్వారా యూఏఈకి చేరుకుంటున్నారని అన్నారు. 

స్మార్ట్ ట్రావెల్ ఎండీ అఫీ అహ్మద్ మాట్లాడుతూ.. భారత్ నుంచి ఒమన్‌కు వన్‌వే టికెట్ ధర కేవలం 900 దిర్హాములు మాత్రమే. అలాగే ఒమన్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి యూఏఈలోని ఏ గమ్యస్థానానికైన వెంటనే కనెక్టింగ్ ఫ్లైట్ దొరుకుతుందని తెలిపారు. అంతేగాక ఇక్కడి నుంచి యూఏఈ వెళ్లేందుకు బస్ అప్షన్ కూడా ఉంటుంది. దీని ధర కేవలం 55 దిర్హాములు. తక్కువ ధరలో ప్రయాణం ముగించాలనుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ప్రయాణీకులకు మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉండడం వల్ల ఎటువంటి సమస్య లేకుండా దేశంలోకి ప్రవేశించవచ్చని అన్నారాయన. 
ఈ వారం టిక్కెట్ ధరలో స్వల్ప తగ్గుదల నమోదైందని గలాదరి ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్వీసెస్ మేనేజర్ రాజా మీర్ వసీం తెలిపారు. కానీ వచ్చే వారం నుండి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి టిక్కెట్ ధరలు మరింత పెరగవచ్చని వసీం అన్నారు. ముంబై, కేరళలోని కన్నూర్ నుంచి మస్కట్ మీదుగా దుబాయ్ వెళ్లేందుకు 30కి పైగా టిక్కెట్లు బుక్ చేసుకున్నట్లు సిద్ధిక్ ట్రావెల్స్ డైరెక్టర్ తాహా సిద్ధిక్ తెలిపారు. ఇక భారత్ నుంచి దుబాయ్‌తో పాటు యూఏఈలోని మిగతా గమ్యస్థానాలకు డైరెక్ట్ విమానాల్లో ఉండే ధరల కంటే కూడా సగం రేట్లకే జీసీసీ దేశాల ద్వారా కనెక్టింగ్ విమానాల్లో వెళ్లొచ్చని తాహా వివరించారు. కన్నూర్ లేదా ముంబై నుంచి మస్కట్‌కు 400-500 దిర్హాములు అవుతుంది. ఒమన్ వీసాకు మరో వంద దిర్హమ్లు, మస్కట్ నుంచి దుబాయ్‌కు ప్రైవేట్ బస్‌ చార్జీలు ఇంకో 100 దిర్హమ్స్. ఇలా ఈ మొత్తం వ్యయం కలుపుకున్న డైరెక్ట్ విమానానికి  అయ్యే ఖర్చులతో పోలిస్తే 50శాతం ఉంటుందని తాహా చెప్పుకొచ్చారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com