అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగు విద్యార్థులు మృతి..

- October 26, 2022 , by Maagulf
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగు విద్యార్థులు మృతి..

అమెరికా: అమెరికాలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు మరణించారు. వీరిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వాళ్లుకాగా, మరొకరు ఏపీకి చెందిన వ్యక్తి. మృతులను సాయి నరసింహ (ఏపీ, పశ్చిమ గోదావరి), ప్రేమ్ కుమార్ రెడ్డి (హైదరాబాద్), పావని (వరంగల్)గా గుర్తించారు.

మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 5.00-7.00ల మధ్య, కనెక్టికట్ రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది. సాయి నరసింహ, ప్రేమ్ కుమార్ రెడ్డి, పావనితోపాటు ఐశ్వర్య అనే మరో యువతి కలిసి ఒక మినీ వ్యానులో ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో వ్యానులో ఎనిమిది మంది ఉన్నారు. ఈ వ్యానును ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మిగతా వారిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి చేర్చి, చికిత్స అందిస్తున్నారు. ఉదయం పొగ మంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

కాగా, ప్రమాదంలో ఐశ్వర్య స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం. మృతుల్లో సాయి నరసింహ ఈ ఏడాది ఆగష్టులోనే అమెరికా వెళ్లాడు. మరోవైపు తమ వారి మృతదేహాల్ని ఇండియా తీసుకొచ్చేందుకు సహకరించాలని మృతుల కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com