మానవీయ సేవలు అందించటంలో ముందంజలో ఉన్న రెడ్ క్రాస్: ఏపీ గవర్నర్

- October 28, 2022 , by Maagulf
మానవీయ సేవలు అందించటంలో ముందంజలో ఉన్న రెడ్ క్రాస్: ఏపీ గవర్నర్
విజయవాడ: రెడ్‌క్రాస్ సొసైటీ సమాజంలోని నిరుపేద, బలహీన వర్గాలకు మానవతా సేవలను అందించడంలో ముందంజలో ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.  శుక్రవారం విజయవాడ ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన రెడ్‌క్రాస్‌ సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ అధ్యక్షుడు బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ,  జిల్లా శాఖలను బలోపేతం చేస్తూ, సొసైటీకి అవసరమైన ఆర్థిక వనరులను అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న సభ్యులు, జిల్లా కలెక్టర్లు అభినందనీయులన్నారు. కరోనా మహమ్మారి సమయంలో వలస కార్మికులకు ఆహారం, ఆశ్రయం కల్పించడం ద్వారా సత్వర ప్రతిస్పందనను చూపారన్నారు. 
వాతావరణ మార్పుల ప్రభావాలను అరికట్టటంలో చెట్ల పెంపకం ఎలా సహాయపడుతుందో తెలియజేస్తూ యువత, విద్యార్థులలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్ పేర్కొన్నారు. వాయు కాలుష్య స్థాయిని సైతం అరికట్టాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రక్తం అందక ఒక్క ప్రాణం కూడా పోకుండా మరిన్ని రక్తదాన శిబిరాలు నిర్వహించాలని రెడ్‌క్రాస్ సభ్యులకు గవర్నర్ విజ్ఞప్తి చేశారు. మానవీయ కోణంలో అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినందుకు గాను సంస్ధ ఆంధ్రప్రదేశ్ శాఖ ఛైర్మన్ డాక్టర్ ఎ.శ్రీధర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు, గవర్నర్ ప్రత్యేక్ ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా, ప్రధాన కార్యదర్శి ఎ.కె. పరిడాలను గవర్నర్ అభినందించారు. గవర్నర్ హరిచందన్ జిల్లా కలెక్టర్లు ఎస్. డిల్లీ రావు (ఎన్టీఆర్ జిల్లా) పి.రంజిత్ బాషా (కృష్ణ) శ్రీకేష్ బి. లఠ్కర్  (శ్రీకాకుళం),  ఎ. దినేష్ కుమార్ (ప్రకాశం) లకు పతకాలు, ధృవపత్రాలను అందజేశారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com