‘మూన్ లైటింగ్’ ఉద్యోగులకు ఐటీ అధికారులు వార్నింగ్..

- November 04, 2022 , by Maagulf
‘మూన్ లైటింగ్’ ఉద్యోగులకు ఐటీ అధికారులు వార్నింగ్..

న్యూ ఢిల్లీ: కోవిడ్-19 తో వచ్చిన లాక్‌డౌన్ వర్క్ ఫ్రమ్‌హోమ్‌లకు దారి తీసింది. దీంతో ఐటీ రంగంలో ‘మూన్ లైటింగ్’ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. గతంలో ఎప్పుడూ వినిపించని ఈ పదం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. దీనికి కారణం లాక్‌డౌన్‌తో వచ్చిన ఐటీ ఉద్యోగుల వర్క్‌ఫ్రమ్‌హోమ్. ఈ మూన్ లైటింగ్ అనే పదం ఐటీ కంపెనీల్లో ప్రకంపనలు రేపింది. ఆయా ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చేలా చేసింది. ఇలా మూన్ లైటింగ్ అనేది ఆయా ఐటీ కంపెనీలను మోసం చేయటమేననే వాదన వచ్చింది. దీంతో ఇప్పటికైనా మూన్ లైటింగ్ విధానం మానివేయాలని లేదంటే కోత తప్పదంటూ వార్నింగ్ లు కూడా ఇచ్చాయి కొన్ని ఐటీ కంపెనీలు.

ఈక్రమంలో ఈ మూన్ లైటింగ్ ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ వార్నింగ్ ఇచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా రెండు ఉద్యోగాలు చేస్తూ సంపాదించిన ‘ఆ రెండో జీతానికి’కూడా పన్ను కట్టాల్సిందేనంటూ వార్నింగ్ ఇచ్చింది. ఓ కంపెనీలో పనిచేస్తూ దాని కళ్లుగప్పి ఇంకో సంస్థలోనూ పనిచేయడాన్నే మూన్‌లైటింగ్ అంటారు. సాధారణంగా చెప్పుకోవాలంటే చాలామంది ఇలా రెండు ఉద్యోగాలు చేస్తుంటారు. చేస్తున్న ఉద్యోగంలో సరిపడా వేతనం లేకపోవడం, పెరిగిపోతున్న జీవన వ్యయాన్ని తట్టుకోలేక ఇలా ‘రెండు చేతులా’ సంపాదిస్తుంటారు. తమ సంస్థలో కాకుండా మరో కంపెనీలోనూ చేయడాన్ని జీర్ణించుకోలేని కొన్ని సంస్థలు ‘మూన్ లైటింగ్’ ఉద్యోగులను హెచ్చరించి వదిలేశాయి. విప్రోలాంటి సంస్థ 300 మంది ఉద్యోగులపై వేటు వేసింది.

గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో కూర్చుని రెండు మూడు ఉద్యోగాలు చేసేసి రెండు చేతులా సంపాదించే ఈ ‘మూన్‌ లైటింగ్’ వ్యవహారంపై ఆదాయపన్ను శాఖ కూడా దృష్టి పెట్టింది. రెండోఉద్యోగంలో సంపాదించే దానికి కూడా పన్ను చెల్లించాల్సిందేనంటూ హెచ్చరికలు జారీ చేసింది. పన్ను నిబంధనలు రెండో ఉద్యోగానికి కూడా వర్తిస్తాయని వెల్లడించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు గానీ, ప్రొఫెషనల్ ఉద్యోగులకు కానీ ఏ కంపెనీ అయినా వ్యక్తిగత చెల్లింపులు అయినా సరే రూ. 30 వేలు దాటితే..ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ (టీడీఎస్) వర్తిస్తుందని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ప్రిన్సిపల్ చీఫ్ ఐటీ కమిషనర్ ఆర్.రవిచంద్రన్ స్పష్టం చేశారు.

ఆదాయపన్ను సెక్షన్‌లోని 194సి ప్రకారం.. కాంట్రాక్ట్ పని కోసం చేసే చెల్లింపుల నుంచి టీడీఎస్‌ను మినహాయించాల్సిందే. ఏదైనా సంస్థ, ట్రస్ట్ కానీ, కంపెనీ, స్థానిక యంత్రాంగం వంటివి దీని కిందికి వస్తాయి. నగదు చెల్లింపులు, చెక్, డ్రాఫ్ట్ ఎలా చెల్లించినా సరే టీడీఎస్‌ మినహాయింపు తప్పనిసరి. రూ. 30 వేలు దాటిన తర్వాత 10 శాతాన్ని టీడీఎస్ కింద మినహాయించాలని ఐటీ చట్టంలోని సెక్షన్ 194జె చెబుతోంది. అంతేకాదు, ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన చెల్లింపు లక్ష రూపాయలు దాటినప్పుడు కూడా టీడీఎస్‌ను మినహాయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఉద్యోగులెవరైనా అదనపు ఆదాయం ఉన్నప్పుడు ఆ విషయాన్ని ఐటీ రిటర్న్స్‌లో వెల్లడించి, అందుకు పన్ను మొత్తాన్ని చెల్లించాలని ఐటీశాఖ కోరింది. అంతేకాదు, రెండో ఆదాయం అందుకుంటూ ఆ విషయాన్ని ఆ తర్వాత బయటపెడితే జరిమానా తప్పదని..ఇంచా తప్పదంటే..విచారణ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com