ఐటీ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త...

- December 09, 2022 , by Maagulf
ఐటీ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త...

న్యూ ఢిల్లీ: ఐటీ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సెజ్ (స్పెషల్ ఎకనమిక్ జోన్) పరిధిలోని ఐటీ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఎప్పటినుంచో అమలవుతున్నప్పటికీ, దీన్ని తాజాగా వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగించింది.

దీని ప్రకారం ఇకపై ‘సెజ్’లోని కంపెనీల్లో పని చేసే వంద శాతం ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం లేదా సెజ్ బయట ఎక్కడి నుంచైనా పనిచేసుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రటకన విడుదల చేసింది. అయితే, దీన్ని కంపెనీలు అమలు చేసే విషయంలో కొన్ని సూచనలు చేసింది. ఈ నిర్ణయాన్ని అమలు చేసే కంపెనీలు స్థానిక డెవలప్‌మెంట్ కమిషనర్‌కు విషయాన్ని తెలియజేయాలి. లేఖ ద్వారా అనుమతి పొందాలి. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రం హోం పొందాలి అనుకుంటే సంబంధిత గడువు ముగిసేలోగా తిరిగి అనుమతి తీసుకోవాలి. ఎంత మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు అనే విషయాన్ని ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదు.

కానీ, ఆ వివరాల్ని కంపెనీలు మాత్రం నమోదు చేసుకోవాలి. కోవిడ్ సందర్భంలో ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోం పద్ధతికి అనుమతించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఏడాది పాటు మాత్రమే దీనికి అనుమతించారు. అందులోనూ 50 శాతం ఉద్యోగులకు మాత్రమే అనుమతి ఉండేది. కానీ, తర్వాత దీన్ని పొడిగిస్తూ, వంద శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం పద్ధతిలో పని చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com