విజయవాడలోని ఎ-1 కన్వెన్షన్‌ సెంటర్‌లో మేడే వేడుకలు

- May 01, 2016 , by Maagulf
విజయవాడలోని ఎ-1 కన్వెన్షన్‌ సెంటర్‌లో మేడే వేడుకలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని ఎ-1 కన్వెన్షన్‌ సెంటర్‌లో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి సుజనాచౌదరితో పాటు, పలువురు రాష్ట్రమంత్రులు, కార్మికశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రన్న బీమా పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కోటి 50లక్షల మంది అసంఘటిత కార్మికులకు బీమా పథకం వర్తింపచేయనున్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. బీమా పథకం ద్వారా అసంఘటి రంగ కార్మికులు మరణిస్తే రూ.5లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్మిక సంఘాలు స్వార్థం వీడాలని, మారిన పరిస్థితులకు అనుగుణంగా యాజమాన్యాలు ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. ప్రపంచీకరణలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోంది .. తక్కువ ఖర్చుతో నాణ్యంగా ఉంటేనే ఉత్పత్తులకు డిమాండ్‌ ఉంటుందన్నారు. రాయితీలు ఇచ్చి పరిశ్రమలకు ఆక్సిజన్‌ ఇచ్చామని పేర్కొన్నారు. విభజన మనం కోరుకున్నది కాదు.. అన్ని అన్ని రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే వరకు కేంద్ర చేయూత ఇవ్వాలని కోరారు. ఇబ్బందులున్నా.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు.కేంద్రమంత్రి సుజనాచౌదరి మాట్లాడుతూ.. కార్మికులే దేశానికి వెన్నెముక... కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న బీమా దేశంలో ఎక్కడా లేదన్నారు. కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. కార్మికులకు గృహ నిర్మాణాలపై యాజమాన్యాలతో చర్చిస్తున్నామన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తెప్పించి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. కార్మికశాఖకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఆన్‌లైన్‌ ద్వారా అమలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌, జలీల్‌ఖాన్‌, బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com