గుజరాత్ తీరంలో భారీ స్థాయిలో పట్టుబడ్డ డ్రగ్స్..

- March 07, 2023 , by Maagulf
గుజరాత్ తీరంలో భారీ స్థాయిలో పట్టుబడ్డ డ్రగ్స్..

గుజరాత్: గుజరాత్ తీరం నుంచి దేశంలోకి అక్రమంగా డ్రగ్స్ తరలించేందుకు యత్నిస్తున్న ముఠాను భారత అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.425 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రం మీదుగా దేశంలోకి డ్రగ్స్ రవాణా అవుతున్నాయని ఇంటెలిజెన్స్ సమాచారం అందింది.

దీంతో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), తీర రక్షక దళం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిఘా పెంచారు. సోమవారం రాత్రి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిచారు. తీరం వెంట తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో తీరానికి వంద నాటికల్ మైళ్ల దూరంలో ఒక బోటు అనుమానాస్పదంగా కనిపించింది. వెంటనే అధికారులు బోటును వెంబడించి పట్టుకున్నారు. ఆ బోటులో 61 కిలోల డ్రగ్స్ లభించాయి. ఈ డ్రగ్స్ విలువ రూ.425 కోట్లు ఉంటుందని అంచనా. ఇది ఇరాన్‌కు చెందిన బోటుగా అధికారులు తేల్చారు. బోటులో ఉన్న ఐదుగురు ఇరానియన్లను అరెస్టు చేసి, తీరానికి తీసుకొచ్చారు.

బోటును, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ డ్రగ్స్ తీసుకునేందుకు ప్రయత్నించే ముఠా కోసం కూడా గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాళ్లను పట్టుకునేందుకు తీరం వెంబడి నిఘా కట్టుదిట్టం చేశారు. ఈ డ్రగ్స్ దందాపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com