రియాద్కు చేరుకున్న 16 మంది సౌదీలు.. అభా నుండి సనాకు 250 మంది హౌతీలు
- April 16, 2023
రియాద్: 16 మంది సౌదీలు, ముగ్గురు సూడానీస్ సహా సంకీర్ణ దళాలకు చెందిన మొత్తం 19 మంది ఖైదీలు శనివారం రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సౌదీ-యెమెన్ ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా వీరు రియాద్ చేరుకున్నారు. మరోవైపు 250 మంది హౌతీ ఖైదీలు కూడా అభా అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సనాకు బయలుదేరారని యెమెన్లో సంకీర్ణ దళాల ప్రతినిధి జనరల్ టర్కీ అల్-మాలికీ వెల్లడించారు. అంతర్జాతీయ రెడ్క్రాస్ కమిటీ, అలాగే యెమెన్లోని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రత్యేక రాయబారి హన్స్ గ్రండ్బర్గ్ ఖైదీల మార్పిడికి చేసిన కృషిని కూడా ఆయన అభినందించారు.
రియాద్ విమానాశ్రయంలో దిగిన ఖైదీలను చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ జనరల్ ఫయాద్ అల్-రువైలీ, డిప్యూటీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్, జాయింట్ ఫోర్సెస్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ముత్లాక్ అల్-అజిమా, సాయుధ దళాల శాఖల కమాండర్లు స్వాగతం పలికారు. 120 మంది మాజీ ఖైదీలతో కూడిన విమానం శనివారం అభా నగరం నుండి బయలుదేరింది. యెమెన్లోని ఆరు విమానాశ్రయాలకు 15 విమానాలను నడుపుతూ, ఇరువైపులా 800 మంది ఖైదీలను మార్పిడి చేసుకునేందుకు శని, ఆదివారాల్లో ఆపరేషన్ కొనసాగుతుంది.
అంతర్జాతీయ రెడ్క్రాస్ కమిటీ (ICRC) విమానాలు 318 మంది ఖైదీలను యెమెన్ రాజధాని సనా, అడెన్లకు తరలించడంతో ఇరుపక్షాల మధ్య ఖైదీల మార్పిడి మొదటి దశ శుక్రవారం ప్రారంభమైందని మానవ హక్కుల మంత్రిత్వ శాఖలోని అండర్ సెక్రటరీ మాజిద్ ఫడేల్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. హౌతీ బృందం విడుదల చేసిన 69 మంది ఖైదీల్లో మాజీ రక్షణ మంత్రి మహమూద్ అల్-సుబైహి, యెమెన్ అధ్యక్షుడు అబెద్రబ్బో మన్సూర్ హదీ సోదరుడు నాజర్ మన్సూర్ హదీ ఉన్నారు. యెమెన్ ప్రభుత్వం 249 మంది ఖైదీలను విడుదల చేసింది. వీరిని రెండు విమానాలలో అడెన్ నుండి సనాకు తరలించారు.
అంతర్జాతీయ రెడ్క్రాస్ కమిటీ నివేదిక ప్రకారం, అక్టోబర్ 2020లో జరిగిన చివరి ప్రధాన మార్పిడిలో 1,050 మందికి పైగా ఖైదీలు విడుదలయ్యారు. అంతర్జాతీయ రెడ్క్రాస్ కమిటీ ఆధ్వర్యంలో మార్చి 23 న స్విట్జర్లాండ్లోని బెర్న్లో జరిగిన చర్చల ఫలితంగా ఖైదీల మార్పిడి ప్రక్రియ ప్రారంభమైంది.
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
- DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
- సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!







