రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వాలి

- May 10, 2016 , by Maagulf
రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వాలి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఇవాళ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రధానికి వివరించారు. తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కొవడానికి, కరువు నివారణ కోసం చేపట్టే పనులకు అవసరమైన నిధులను సమకూర్చాలని ప్రధానిని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరువును ఎదుర్కొవడానికి తాత్కాలికంగా చేపట్టిన కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి వివరించారు. కరువును ఎదుర్కొవడానికి మంచినీటి సరఫరా, ఇన్‌పుట్ సబ్సిడీ, పశుగ్రాసం పంపిణీ, పిల్లలకు మధ్యాహ్న భోజనంలాంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నా ప్రజలకు మంచినీరు, పొలాలకు సాగునీరు అందించే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కార్యక్రమాలను ప్రధాని అభినందించారు.
ఏడు జిల్లాల్లో 231 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించామని సీఎం తెలిపారు. తెలంగాణ సాధారణ వర్షపాతం కన్నా ఈసారి 14 శాతం తక్కువ కురిశాయని పేర్కొన్నారు. నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ, మంచినీటి సరఫరా, పశుగ్రాసం అందజేయడానికి ప్రజలకు ఉపాధి కల్పించడానికి రూ.3064 కోట్లు కావాలని కేంద్రాన్ని కోరామని, కానీ కేంద్రం కేవలం రూ.712 కోట్లు మాత్రమే ఇచ్చిందని వివరించారు. మిగతా నిధులను విడుదల చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. కరువు వల్ల 13.52 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. 21.78 లక్షల మంది రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్‌లాంటి పంటలు దెబ్బతిన్నాయన్నారు. 23,700 హెక్టార్లలో కూరగాయలు, మామిడి, బత్తాయి, పసుపు, మిరపలాంటి తోటలు దెబ్బతిన్నాయన్నారు. కేంద్రం ఎంత త్వరగా నిధులు కేటాయిస్తే తాము అంత త్వరగా ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com