సీఎం జగన్ కీలక నిర్ణయం!

- August 09, 2023 , by Maagulf
సీఎం జగన్ కీలక నిర్ణయం!

అమరావతి: మూడు రాజధానులపై పట్టుబట్టిన సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారా? త్వరలో విశాఖకు వెళ్దాం అంటూ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తున్న జగన్.. ఈ సారి ముహూర్తం ఫిక్స్ చేసేశారా? పరిపాలన రాజధానిపై కోర్టులో వివాదం కొనసాగుతున్నందున.. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని తన నివాసాన్ని  విశాఖపట్నానికి మార్చుకోవాలని భావిస్తున్నారట సీఎం జగన్.. అక్టోబర్ కల్లా తన మకాం విశాఖకు మారేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారట. 

చలో విశాఖ అంటూ తరచూ ప్రకటనలు చేసే ఏపీ ప్రభుత్వం..ఈసారి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల్లో అంటే వచ్చే అక్టోబర్‌ నుంచే విశాఖ కేంద్రంగా ప్రభుత్వ పాలన కొనసాగాలని పట్టుదలగా ఉన్నారు సీఎం జగన్. మొత్తం పాలనా యంత్రాంగాన్ని విశాఖకు తరలిస్తారా? లేదా? అన్నది క్లారిటీ లేకపోయినా.. సీఎం క్యాంపు కార్యాలయం మాత్రం విశాఖకు తరలిపోవడం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే రుషికొండలో సీఎం ఆఫీస్ భవనాలు సిద్ధమయ్యాయని అంటున్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని రాజధాని రైతులు కేసులు వేయడంతో జగన్ కోరుకున్న మూడు రాజధానులు ప్రతిపాదన ఇన్నాళ్లు ముందుకు కదలలేదు. ఇప్పుడు కూడా కోర్టు కేసు ప్రతిబంధకంగా ఉన్నా.. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పాలించే సౌలభ్యం ఉండటంతో విశాఖకు తరలివెళ్లాలని డిసైడయ్యారు జగన్.

గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు. రాష్ట్రం అన్నివిధాల అభివృద్ధి జరగాలంటే.. రాజధాని ప్రాంతంలోనే అభివృద్ధి కేంద్రీకృతం కాకూడదని.. నలువైపులా అభివృద్ధి జరగాలని జగన్ ఆలోచన. అంతేకాకుండా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అమరావతిలో రాజధాని నిర్మించడం భారంగా భావిస్తోంది వైసీపీ ప్రభుత్వం. అందుకే అన్ని వనరులు ఉన్న విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని ప్రతిపాదిస్తోంది. దీనికి అమరావతి రైతులు వ్యతిరేకిస్తూ కోర్టుకెక్కడం.. అసెంబ్లీ ఆమోదించిన బిల్లు కూడా లోపభూయిష్టంగా ఉండటంతో వెనక్కి తీసుకుంది ప్రభుత్వం. కానీ, ఎలాగైనా విశాఖలో పరిపాలన రాజధాని స్థాపించాలనే నిర్ణయానికి మాత్రం కట్టుబడే ఉంది. ఎప్పటికప్పుడు విశాఖ నుంచి పరిపాలన సాగిస్తామని గతంలో చాలా సార్లు ప్రకటించింది. సంక్రాంతి, ఉగాది, దసరా వంటి పండగలతో పాటు.. జూన్, జులై అంటూ ఎప్పటికప్పుడు నెలలు.. రోజులు ప్రకటిస్తూ.. విశాఖ రాజధాని అన్న పాయింట్‌ను ఎప్పుడూ హాట్‌టాపిక్‌గానే ఉంచింది. ఐతే ఇన్నాళ్లు ఈ తేదీలు, నెలలు వాయిదా పడినా ఈ సారి మాత్రం అక్టోబరు ముహూర్తం పక్కాగా ఫిక్స్ అంటున్నారు పరిశీలకులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com