చంద్రునిపై భారత్ ముద్ర..చంద్రయాన్-3 విజయవంతం..భావోద్వేగభరిత క్షణాలు

- August 23, 2023 , by Maagulf
చంద్రునిపై భారత్ ముద్ర..చంద్రయాన్-3 విజయవంతం..భావోద్వేగభరిత క్షణాలు

చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయింది. లూనార్ డే (14 రోజులు) ముగిసేలోపు రోవర్, ల్యాండర్ సమాచారాన్ని పంపిస్తాయి. రెండు వారాల పాటు అవి చంద్రుడి ఉపరితలంపై తిరుగుతాయి.

ప్రయోగం సఫలం కావడంతో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. ఇంతకు ముందు అమెరికా, రష్యా, చైనా సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా నిలిచింది. భారత్ సత్తా అంటే ఇది అని ప్రపంచం గుర్తించింది. భారత్ శాస్త్రవేత్తలపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

రోవర్ ప్రజ్ఞాన్, ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై దిగాక మొదట ల్యాండర్ లోని ఒకవైపు ప్యానెల్ తెరుచుకుంటుంది. ఆరు చక్రాలు ఉండే రోవర్‌ బయటకు రావడానికి వీలుగా ర్యాంప్ ఏర్పడుతుంది. నాలుగు గంటల తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వస్తుంది.

రోవర్ ప్రజ్ఞాన్‌లో భారత జాతీయ పతాకం, అలాగే, ప్రజ్ఞాన్ చక్రాలపై ఇస్రో లోగోలను ముద్రించారు. ఒక్క క్షణానికి ఒక సెంటీమీటర్ వేగం చొప్పున అది ముందుకు వెళ్తూ అక్కడి పరిసరాలను నేవిగేషన్ కెమెరాల ద్వారా స్కాన్ చేస్తుంది. రోవర్ కదుతున్న సమయంలో చంద్రుడి ఉపరితలంపై భారత జాతీయ పతాకం, ఇస్రో లోగోల ముద్రలు పడతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com