భారత్‌లో గతేడాది రికార్డు స్థాయిలో పాస్‌పోర్టుల జారీ!

- February 25, 2024 , by Maagulf
భారత్‌లో గతేడాది రికార్డు స్థాయిలో పాస్‌పోర్టుల జారీ!

న్యూ ఢిల్లీ: భారత్‌లో గతేడాది రికార్డు స్థాయిలో పాస్‌పోర్టులు జారీ అయ్యాయి. రోజుకు సగటున 37,700 చొప్పున గతేడాది సుమారు 1.37 కోట్ల పాస్‌పోర్టులు జారీ అయ్యాయని విదేశాంగ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.


ఈ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం భారత్‌లో వ్యాలిడిటీ ఉన్న పాస్‌పోర్టుల సంఖ్య 9.26 కోట్లు. ఇందులో 4.93 కోట్ల పాస్‌పోర్టులను 2019 తరువాతే జారీ చేశారు. మొత్తం పాస్‌పోర్టుల్లో 65 శాతం పురుషుల వద్ద, మిగతావి మహిళల వద్ద ఉన్నాయి.

పాస్‌పోర్టుల జారీలో ఉత్తర్‌ప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. ఆ తరువాత స్థానంలో కేరళ, మహారాష్ట్ర ఉన్నాయి. మహిళ పాస్‌పోర్టుదారులు కేరళలో అత్యధికంగా ఉన్నారు. ఆ తరువాతి స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. స్త్రీ, పురుష పాస్‌పొర్టుదారుల సంఖ్యలో అంతరం ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. మిజోరంలో పాస్‌పోర్టుదారుల్లో స్త్రీల వాటా 62 శాతం, నాగాలాండ్‌లో ఇది 55 శాతంగా ఉంది. సిక్కింలోని పాస్‌పోర్టుదారుల్లో దాదాపు సగం మంది మహిళలు.

గతేడాది ఏడాది మొత్తం పాస్ట్‌పోర్టుల్లో సగం.. కేరళ (15.47 లక్షలు), మహారాష్ట్ర (15.10 లక్షలు), ఉత్తరప్రదేశ్ (13.68 లక్షలు), తమిళనాడు (11.47 లక్షలు), పంజాబ్ (11.4 లక్షలు) రాష్ట్రాల్లోనే జారీ చేశారు. విదేశీ ప్రయాణాలు, పాస్‌పోర్టు సులభంగా లభించడం తదితర కారణాల రీత్యా పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య అధికంగా ఉంటోంది. విదేశాంగ శాఖ ప్రకారం, 2015లో పాస్‌పోర్టు జారీకి సగటున 21 రోజులు పడుతుండగా 2023లో ఇది ఆరు రోజులకు పడిపోయింది.

పాస్‌పోర్టు చట్టం-1967 ప్రకారం, కేంద్రం.. ఆర్డినరీ, డిప్లొమేటిక్, అఫీషియల్, ఎమర్జెన్సీ సర్టిఫికేట్, సర్టిఫికేట్ ఆఫ్ ఐడెంటిటీ పేరిట ఐదు రకాల పాస్‌పోర్టులను జారీ చేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com