దళితోద్ధారకుడు..!
- April 05, 2024"బాబూజీ" అని పిలుచుకునే జగ్జీవన్ రామ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా అణగారిన సమాజం ఉద్ధరణ గురించి మాట్లాడినా, దళితుల హక్కుల కోసం పోరాడాలనే మాట వచ్చినా.. సువర్ణాక్షరాలతో గుర్తుపెట్టుకునే పేరు.అంటరానివారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నం. నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి.
బాబు జగ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5న బీహార్లోని షాహాబాద్(ఇప్పుడు భోజ్పూర్) జిల్లాలోని చంద్వా అనే చిన్న గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన పాఠశాలలోనే మొదటిసారిగా వివక్షను అనుభవించాడు. పాఠశాలలో విద్యార్థుల కోసం మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తూ రెండు కడవలపై ‘హిందూ పానీ’, ‘ముస్లిం పానీ’ అని రాసి ఉంచేవారు. అయితే జగ్జీవన్ రామ్ హిందూ పానీలో మంచినీరు తాగారని హిందూ విద్యార్థులు ఆ కుండలోని నీరు త్రాగేవారు కాదు.
ఈ ఉదంతంతో ఆగ్రహించిన బాబు ఒక రాయి విసిరి ఆ కుండను ముక్కలు ముక్కలు చేశాడు. అప్పుడు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ‘హరిజన పానీ’ అనే మరో కుండను ఏర్పాటు చేశాడు. జగ్జీవన్ రామ్ ఆ కుండని కూడా పగులకొట్టాడు. ఇక చేసేదేమీ లేక ఆ పాఠశాల వారు ఒకే కుండను ఏర్పాటు చేశారు.ఈ అనుభవాలే ఆయన దళిత జనుల జాగృతి వైపు ముందుకు సాగడానికి ప్రేరణనిచ్చాయి.
తండ్రి జీవన తాత్విక బాటలో అహింసా తత్వాన్ని పుణికి పుచ్చుకొని, గాంధీ స్ఫూర్తితో జగ్జీవన్ రామ్ జాతీయోద్యమంలో పాల్గొని,బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో కీలకంగా వ్యవహరించారు. సామాజిక సమానత్వంపై అందరినీ చైతన్య పరిచేందుకు 1934లో ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్, అఖిల్ భారతీయ రవిదాస్ మహాసభలకు పునాది వేశారు.
1936-1986 మధ్య 50 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పార్లమెంటు సభ్యుడిగా జగ్జీవన్ రామ్ ప్రపంచ రికార్డు సాధించారు. నెహ్రూ,శాస్త్రి,ఇందిరా,మొరార్జీ దేశాయ్ మంత్రివర్గాల్లో కీలకమైన మంత్రి పదవులను అధిరోహించారు.అత్యంత గౌరవనీయమైన దళిత నాయకుల్లో ఒకరైన రామ్ దేశంలో హరిత విప్లవం విజయవంతం కావడంలో కీలకమైన పాత్ర పోషించారు.
జగ్జీవన్ రామ్ కార్మిక పక్షపాతి. కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారు. కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో స్వతంత్ర కమిషన్లను ఏర్పాటు చేసి నివేదికల ఆధారంగా కార్మిక ప్రజా ప్రయోజనాల కోసం కనీస వేతనాల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సవరణ) చట్టం, బోనస్ చెల్లింపుల చట్టం వంటి వివిధ కార్మిక ప్రజోపయోగ చట్టాలను రూపొందించారు.
దళితుల హక్కులను రాజ్యాంగంలో అంబేడ్కర్ పొందుపరిస్తే వాటిని చట్ట రూపంలో అమలుచేయడానికి జగ్జీవన్రామ్ చేసిన కృషి ఎప్పటికీ మరిచిపోలేనిది. భారతదేశ ప్రజల చేత ‘బాబూజీ’ అన్న పిలుపు పొందిన గౌరవం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే దక్కింది. ఒకరు మహాత్మాగాంధీ కాగా, మరొకరు బాబూ జగ్జీవన్ రామ్.సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం సాగించిన రాజకీయ, సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్ రామ్.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!