సిలికాన్ వ్యాలీలో ఎన్నారైలతో కేటీఆర్ సమావేశం..
- June 08, 2016
తెలంగాణలో పెట్టుబడుల కోసం అమెరికాలోని వివిధ రంగాల్లో విజయవంతమైన తెలంగాణ ఎన్నారైల సేవలను వినియోగించుకోనున్నట్లు మంత్రి కె.తారకరామారావు తెలిపారు. తెలంగాణ గడ్డ నుంచి చాలా మంది కొన్ని దశాబ్దాల కిందటే అమెరికాలో ఉద్యోగాలు ప్రారంభించి, వివిధ కంపెనీల్లో ఉన్నత స్థానాలకు ఎదిగారన్నారు. మరికొంత మంది సొంత కంపెనీలు నెలకొల్పారని, ఇంకొందరు వెంచర్ క్యాపిటలిస్టుగా రాణిస్తున్నారన్నారు. ఇలా వివిధ రంగాల్లో విజయవంతమైన ఎన్నారైలతో మంత్రి సిలికాన్ వ్యాలీలో సమావేశమయ్యారు.మెదక్ జిల్లా నుంచి అమెరికాలో స్థిరపడిన ఓం నల్లమాసు కీలక పాత్ర పోషిస్తున్న అప్లైడ్ మెటీరియల్స్ కంపెనీలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజురెడ్డి, రాంరెడ్డి, కిట్టు కొల్లూరి వంటి వెంచర్ క్యాపిటలిస్టులు, వివిధ కంపెనీల్లో టాప్ మేనేజ్మెంట్లలో పనిచేస్తున్న 40 మంది తెలంగాణ ఎన్నారైలు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను ముఖ్యంగా పారిశ్రామిక విధానం, టీ-హబ్, ఐటీ పాలసీ వంటి అంశాలను వివరించిన మంత్రి.. తెలంగాణ ప్రభుత్వం వారి నుంచి కోరుకుంటున్న సహాయ సహకారాలను తెలిపారు. సిలికాన్ వ్యాలీలో ఏర్పాటు చేయబోతున్న టీ-హబ్ అవుట్ పోస్టు ఆలోచనను వారితో పంచుకున్నారు. ఈ ఆలోచనను అభినందించిన ఎన్నారైలు.. అందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అవుట్ పోస్టు ఏర్పాటు, అందులో స్టార్టప్ల ఎంపిక, వాటికి సిలికాన్ వ్యాలీలో వెంచర్ క్యాపిటలిస్టులతో ఆర్థిక సహకారం వంటి అంశాల్లో పూర్తి సహకారం ఇస్తామన్నారు.తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం అత్యుత్తమైందని, రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలను అమెరికాలోని కంపెనీలకు తెలపాలని మంత్రి కోరారు. రాజకీయ స్థిరత్వం, సమర్థవంతమైన పాలన, పారదర్శక విధానాలున్న కొత్త రాష్ట్రాన్ని కంపెనీలకు పరిచయం చేయాలన్నారు. ఎన్నారైల సేవలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను రూపకల్పన చేస్తోందని, తన పర్యటన ముగించుకుని వెళ్లిన వెంటనే సీఎంతో చర్చించి పూర్తి వివరాలతో ప్రకటన చేస్తానని తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







