అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్: 4న రాత్రి వరకూ ఆగాల్సిందే.. షాక్ ఇచ్చిన ఈసీ

- May 30, 2024 , by Maagulf
అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్: 4న రాత్రి వరకూ ఆగాల్సిందే.. షాక్ ఇచ్చిన ఈసీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న జరుగుతుందని మనకు తెలుసు. ఐతే.. పూర్తి ఫలితాలు వచ్చేసరికి రాత్రి 8 నుంచి 9 అయ్యే అవకాశం ఉంది అని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

ఓట్ల లెక్కింపుపై వివరణ ఇచ్చిన ఆయన.. పక్కాగా కౌంటింగ్‌ ఏర్పాట్లు చేశామన్నారు. 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల లెక్కింపు ఉంటుందన్న మీనా.. 61 నియోజకవర్గాల్లో 21-24 రౌండ్ల లెక్కింపు ఉంది అన్నారు. అలాగే.. 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్ల లెక్కింపు ఉందని తెలిపారు. ఇంకా.. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం అదనపు టేబుళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు.

కౌంటింగ్ రోజున ఏం జరుగుతుందంటే:
జూన్ 4న, కౌంటింగ్ రోజున ఓట్లను లెక్కించాల్సిన వారు ఉదయం 4 గంటలకే లెక్కింపు కేంద్రాలకు వెళ్లాలి. 5 గంటలకు ఎవరు ఏ టేబుల్‌ దగ్గర ఉండాలో చెబుతారు. ఆ తర్వాత టైమ్ ప్రకారం కౌంటింగ్ మొదలవుతుంది. ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు చూస్తుండగా స్ట్రాంగ్‌రూంలను తెరుస్తారు. వాటిలోని ఈవీఎంలను లెక్కింపు టేబుళ్లపైకి చేరుస్తారు.

ఆ తర్వాత పోస్టల్ ఓట్లను ముందుగా లెక్కిస్తారు. ప్రతి 25 పోస్టల్‌ బ్యాలట్‌ పత్రాలను ఒక కట్టగా కడతారు. ఒక్కో కౌంటింగ్‌ టేబుల్‌కూ ఒక రౌండ్‌కు గరిష్ఠంగా 20 కట్టలు లెక్కింపు కోసం కేటాయిస్తారు. ఓట్ల లెక్కింపు జరిగే ప్రతి టేబుల్‌ దగ్గరా. అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, ఇద్దరు కౌంటింగ్‌ అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు.

పోస్టల్ బ్యాలెట్ పూర్తయ్యాక, ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఒక్కో అసెంబ్లీ స్థానానికీ 14 చొప్పున కౌంటింగ్‌ టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. పోలింగ్‌ కేంద్రాల సీరియల్‌ నంబర్‌ ఆధారంగా ఈవీఎంలలో ఓట్లను లెక్కిస్తారు. అంటే.. తొలిరౌండ్‌లో 1 నుంచి 14 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలలో ఉన్న ఓట్లను లెక్కించి, రెండో రౌండ్‌లో 15 నుంచి 28 పోలింగ్ కేంద్రాల ఓట్లు లెక్కిస్తారు. ఇలా ఒక్కో రౌండ్‌కూ 14 పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు లెక్కిస్తారు.

ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక.. వీవీ ప్యాట్‌ లోని చీటీల లెక్కింపు మొదలవుతుంది. ఒక్కో అసెంబ్లీ స్థానానికి లాటరీ విధానంలో ఐదు కేంద్రాల వీవీ ప్యాట్‌లను ఎంపిక చేస్తారు. తద్వారా ఈవీఎంలలో పడిన ఓట్లు.. వీవీ ప్యాట్ చీటీలు.. సమానంగా ఉన్నాయో లేదో చూస్తారు. తేడా వస్తే.. మళ్లీ లెక్కిస్తారు. ఇలా మూడుసార్లు చేసి, చివరకు వీవీ ప్యాట్ చీటీల్లోని ఓట్లనే లెక్కలోకి తీసుకొని రిజల్ట్ ప్రకటిస్తారు. ఇలా ఇవన్నీ అయ్యేటప్పటికి సాయంత్రం అయిపోతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com