సిక్కులు లక్ష్యంగా చైనా కుట్ర.. పలుదేశాల నుంచి భారత వ్యతిరేక ప్రచారం..

- May 30, 2024 , by Maagulf
సిక్కులు లక్ష్యంగా చైనా కుట్ర.. పలుదేశాల నుంచి భారత వ్యతిరేక ప్రచారం..

డ్రాగన్ కంట్రీ చైనా తన భారత వ్యతిరేకతను వీడటం లేదు. ఏదో విధంగా భారత్‌ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. తాజాగా సిక్కులను టార్గెట్ చేస్తూ, భారత వ్యతిరేక ప్రచారం కోసం ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైళ్లను క్రియేట్ చేస్తోంది. చైనా మద్దతు ఉన్న ఈ ప్రొఫైళ్లు నిత్యం భారత వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అనేక దేశాలల్లో ఖలిస్తాన్ అనుకూల నిరసనలు ప్రేరేపించడానికి ఈ ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు మెటా రిపోర్టు వెల్లడించింది.

‘‘యూఎస్ఏలో విద్యాభాస్యం చేసి, ఢిల్లీలో నివసిస్తున్న సిక్కు వారసత్వం, భాష-సంస్కృతిపై మక్కువ ఉన్న పంజాబీ అమ్మాయిగా తనను తాను చెప్పుకుంటున్న ఆద్యా సింగ్ అనే యువతి భారత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించడంతో పాటు తన సోషల్ మీడియా పోస్టుల్లో భారత ఆధిపత్యాన్ని ఎదుర్కొవడానికి అమెరికా మద్దతు ఇవ్వాలని కోరుతుంది’’ అయితే నిజమైన విషయం ఏంటంటే ఆద్య సింగ్ అనే యువతి అసలు లేనే లేదు. ఇది చైనాతో లింక్ ఉన్న నకిలీ ప్రొఫైల్ నెట్వర్క్‌లో భాగం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే, ఇలాంటివి అనేకం ఉన్నాయి.

ఇలాంటి ఫేక్ అకౌంట్లలో చైనా హస్తం ఉండొచ్చని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న రిపోర్టులు దీనికి మద్దతు ఇస్తున్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ మరియు ఎక్స్ (గతంలో ట్విట్టర్) వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఉన్న పలు సిక్కు అకౌంట్లు భారతదేశంతో సహా 7 దేశాలలలో భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ఇవన్నీ చైనాకు చెందినవి. మెటా ఇటీవల 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు అసమంజసమైన సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఖాతాలను, పేజీలతో సహా 60కి పైగా చైనా లింక్డ్ సోషల్ మీడియా అకౌంట్లను తొలగించింది.

ఈ నెట్వర్క్స్ చైనా నుంచి ఉద్భవిస్తున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, యూకే, నైజీరియాతో సహా ప్రపంచ సిక్కు సమాజాన్ని లక్ష్యంగా చేసుకుందని మెటా నివేదించింది. మెటా ప్రకారం ఈ ఖాతాలు గతంలో భారత్, టిబెట్లను లక్ష్యంగా చేసుకున్న చైనా నెట్వర్క్‌తో లింక్ చేయబడ్డాయి. ఈ ఖాతాలు అనేక దేశాల్లో ఖలిస్తాన్ అనుకూల నిరసనల్ని ప్రేరేపించడానికి వినియోగిస్తున్నారు. ఈ ఖాతాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించాయి, తరచుగా హిందీ మరియు ఇంగ్లీషులో పోస్ట్ చేస్తూ, భారత ప్రభుత్వంపై పాశ్చాత్య దేశాలు చర్యలను కోరుతున్నాయి. ముఖ్యంగా కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇలాంటి ప్రచారం మరింత ఎక్కువైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com