ఒడియా రాజకీయ సంచనలం..!

- June 26, 2024 , by Maagulf
ఒడియా రాజకీయ సంచనలం..!

భారతదేశ రాజకీయాల్లో ఒడిశా రాష్ట్రం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఉత్తర, మధ్య మరియు దక్షిణ భారత రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉన్న ఒడిశా నుంచి జాతీయ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించిన నేతలు అనేక మంది ఉన్నారు. ఈ కోవలోకి వస్తారు బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. నేడు ధర్మేంద్ర ప్రధాన్ పుట్టినరోజు.

ధర్మేంద్ర ప్రధాన్ 1969, జూన్ 26న ఒడిశా రాష్ట్రంలోని తాల్చేర్ జిల్లా అంగుల్ పట్టణంలో దేబేంద్ర ప్రధాన్, బసంత మంజరి ప్రధాన్ దంపతులకు జన్మించారు. ధర్మేంద్ర భువనేశ్వర్ లోని ఉత్కళ్ విశ్వవిద్యాలయం నుంచి ఆంత్రోపాలజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. తండ్రి దేబేంద్ర ప్రధాన్ బీజేపీ రాజకీయ దిగ్గజాలైన వాజపేయ్, అద్వానీల శిష్యరికంలో ఒడిశా రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. 1999లో వాజపేయ్ మంత్రివర్గంలో కేంద్ర ఉపరితల రవాణా మరియు వ్యవసాయ శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు.

తండ్రి దేబేంద్రకు సంఘ్ పరివార్ మరియు బీజేపీ నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలు కారణంగా ధర్మేంద్ర సైతం రాజకీయాల పట్ల చిన్నతనంలోనే ఆసక్తి పెంచుకోవడం జరిగింది. చిన్నతనంలో బాల స్వయం సేవక్ గా ఆరెస్సెస్ శాఖలకు వెళ్ళేవారు. విద్యార్ధి దశలోనే సంఘ్ అనుబంధ విద్యార్ధి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్( ఏబీవీపీ)లో చేరి డిగ్రీ, యూనివర్సిటీ స్థాయిలో పలు విద్యార్ధి ఆందోళన కార్యక్రమాలకు నాయకత్వం వహించారు.

ఏబీవీపీకి జాతీయ కార్యదర్శిగా పనిచేసిన ప్రధాన్ బీజేపీలో చేరి తాల్చేర్ జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ 2000వ సంవత్సరంలో ఒడిశా అసెంబ్లీకి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. అనంతర రాజకీయ పరిణామాల్లో ఒడిశా భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు.2004 సార్వత్రిక ఎన్నికల్లో దేబేంద్ర ప్రధాన్ ప్రాతినిధ్యం వహించిన దేవగఢ్ లోక్ సభ నుండి ఎంపీగా ఎన్నికవ్వడం జరిగింది. ఎంపీగా ఎన్నికవ్వడంతో ప్రధాన్ బీజేపీ అధిష్ఠానం దృష్టిలో పడటం జరిగింది.

బీజేపీ సీనియర్ నేతలు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీల సాంగత్యం మూలాన బీజేపీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఇదే సమయంలో అప్పటి గుజరాత్ సీఎం, నేటి ప్రధాని నరేంద్ర మోడీతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నారు. జైట్లీ, ప్రధాన్ ల ద్వారా మోడీ పార్టీలోని కీలకమైన నేతలను తనవైపు తిప్పుకున్నారు అని అప్పట్లో బాగా వినిపించేది. 2012లో ప్రధాన్ బీహార్ నుండి రాజ్య సభకు ఎన్నికయ్యారు.

2014 సార్వత్రిక ఎన్నికల ముందు మోడీ బీజేపీ అభ్యర్థిగా ఎంపికవడంలో జైట్లీ, ప్రధాన్ లు కీలకంగా వయ్వహారించారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ మంత్రివర్గంలో కేంద్ర పెట్రోలియం& సహజవాయువు మరియు నైపుణ్యాభివృద్ధి శాఖల స్వతంత్ర  మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.2019-24 వరకు మోడీ 2.0 మంత్రివర్గంలో కేంద్ర మానవ వనరులు,పెట్రోలియం & సహజవాయువు, ఉక్కు మరియు నైపుణ్యాభివృద్ధి శాఖల క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2024లో మోడీ 3.0 మంత్రివర్గంలో కేంద్ర మానవరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.  

ప్రధాన్ జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఒడిశా రాజకీయాల్లో సైతం తన పట్టును పెంచుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 24 ఏళ్లుగా ముఖ్యంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీని ఓడించి బీజేపీని అధికారంలోకి తీసుకు రావడంలో ప్రధాన్ పాత్ర చాలా కీలకం. ఒడిశా ముఖ్యంత్రి అవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాన్ దాన్ని అందుకునేందుకు తనవంతు కృషి చేస్తున్నారు.

-డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com