టాలీవుడ్ ప్రిన్స్....!
- August 09, 2024
మహేశ్ బాబు..ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆ పేరులో మత్తు ఉంది అంటూ లేడీ ఫ్యాన్స్ తెగ ఫీలవుతూ ఉంటారు. మహేష్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. టాలీవుడ్లో భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మహేశ్ ఒకరు. నట శేఖర కృష్ణ తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసిన ఈ హ్యాండ్సమ్ హీరో..నటనలో, స్క్రీన్ ప్రెజెన్స్ లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాదు, ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నాడు. పాన్ ఇండియా మూవీ చేయకుండానే నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నారు. 'ప్రిన్స్' గా, 'సూపర్ స్టార్'గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. నేడు సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు.
ఘట్టమనేని మహేశ్ బాబు 1975, ఆగస్టు 9వ తేదీన సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు జన్మించాడు. అతనికి సోదరుడు రమేష్ బాబుతో పాటుగా.. సోదరీమణులు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. తండ్రి టాలీవుడ్ అగ్ర హీరో కావడంతో చిన్నప్పటి నుంచే సినిమా వాతావరణానికి అలవాటు పడిన మహేష్.. నాలుగేళ్ళ వయసులోనే తన అన్న రమేశ్ బాబుతో కలిసి 'నీడ' చిత్రంతో తొలిసారిగా వెండితెరపై కనిపించాడు.ఆ తర్వాత 1983లో 'పోరాటం' సినిమాతో బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు.
మొదటి మూవీ అయినా, ఎలాంటి బెరుకు లేకుండా కెమెరా ముందు నటించి శభాష్ అనిపించుకున్నాడు. ఇదే క్రమంలో తన తండ్రి హీరోగా నటించిన పలు చిత్రాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. 'శంఖారావం' 'బజారు రౌడీ', 'ముగ్గురు కొడుకులు', 'కొడుకు దిద్దిన కాపురం', 'గూఢచారి 117', 'అన్న-తమ్ముడు', 'బాలచంద్రుడు' వంటి చిత్రాలతో అలరించాడు. అయితే చదువుల మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో కొనేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు.
1999లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'రాజకుమారుడు' చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు మహేశ్ బాబు. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ సాధించి, డెబ్యూ హీరోగా నంది అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'యువరాజు' సినిమా కూడా మంచి విజయం సాధించింది. రెండో సినిమాకే ఒక బాబుకు తండ్రిగా నటించడం ఆయనకే చెల్లింది. 'మురారి' మూవీతో తనలోని పరిపూర్ణమైన నటుడిని బయటకు తీసాడు మహేశ్. 'టక్కరి దొంగ' 'ఒక్కడు' సినిమాలు అతడికి మాస్ లో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. 'నిజం' చిత్రంతో ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్న ప్రిన్స్.. 'నాని' వంటి ప్రయోగాత్మక సినిమాతో ప్లాప్ రుచిచూసాడు. ఆ తర్వాత వచ్చిన 'అర్జున్' 'అతడు' సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
2006లో వచ్చిన 'పోకిరి' సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటికి ఉన్న రికార్డులను చెరిపేసి, సరికొత్త ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పింది. మహేశ్ బాబును సూపర్ స్టార్ గా ఆవిష్కరించింది. అయితే ఆ తర్వాత మరో సక్సెస్ అందుకోడానికి అగ్ర హీరోకి ఐదేళ్లు పట్టింది. 'సైనికుడు', 'అతిథి', 'ఖలేజా' వంటి చిత్రాలు తీవ్ర నిరాశ పరిచాయి. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన 'దూకుడు' మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి, మహేశ్ ను మళ్ళీ రేసులో నిలబెట్టింది.
ఇదే క్రమంలో 'బిజినెస్ మ్యాన్' 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలు ఘన విజయం సాధించాయి. '1 నేనొక్కడినే' చిత్రం పరాజయం పాలైనప్పటికీ, ఫ్యాన్స్ కు ఫేవరేట్ మూవీగా నిలిచింది. అయితే 'ఆగడు' 'బ్రహ్మోత్సవం' 'స్పైడర్' సినిమాలు మాత్రం గట్టి దెబ్బ కొట్టాయి. 'శ్రీమంతుడు' సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్.. 'భరత్ అనే నేను' చిత్రం తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 'మహర్షి' 'సరిలేరు నీకెవ్వరు' 'సర్కారు వారి పాట' సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. మహేశ్ బాబు స్టార్ పవర్ ఏంటో చూపించాయి. 2024 సంక్రాంతికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'గుంటూరు కారం' సినిమాతో ప్రేక్షకులను అలరించారు.
హీరోగా 25 ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకున్న మహేశ్ బాబు.. ఇప్పటి వరకూ 28 చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది పురస్కారాలను 8 సార్లు (రాజకుమారుడు, మురారి, టక్కరి దొంగ, అర్జున్. నిజం, అతడు, దూకుడు, శ్రీమంతుడు) అందుకున్నారు. అలానే 5 ఫిలిం ఫేర్ అవార్డులతో పాటుగా, నాలుగు సైమా అవార్డులు దక్కించుకున్నారు. ఇవే కాకుండా జీ సినీ అవార్డ్స్, ఐఫా ఉత్సవం లాంటి మరికొన్ని పురస్కారాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.
మహేశ్ బాబు నటుడిగా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో.. తన సేవాగుణంతో అంతకంటే మంచి పేరు తెచ్చుకున్నారు. తన సంపాదనలో 30 శాతం సమాజ సేవకు వెచ్చిస్తూ, 'రియల్ హీరో' అనిపించుకున్నారు. ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ, తన మంచి మనసును చాటుకుంటున్నారు. అలానే తెలుగు రాష్ట్రాలలో రెండు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.
దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఒకరిగా ఉన్న మహేశ్ బాబు.. తండ్రి మాదిరిగానే నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నారు. GMB ప్రొడక్షన్స్ బ్యానర్ ను స్థాపించి న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. తాను నటించే సినిమాలలో నిర్మాణ భాగస్వామిగా ఉండటమే కాదు.. ఇతర హీరోలతో చిత్రాలు నిర్మిస్తున్నారు. ఆ విధంగా తీసిన 'మేజర్' మూవీ మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇక తన తోటి హీరోలకు మద్దతుగా నిలవడానికి మహేశ్ ఎప్పుడూ ముందే ఉంటారు. 'జల్సా' 'బాద్ షా' 'ఆచార్య' వంటి చిత్రాలకు ఆయన వాయిస్ ఓవర్ అందించారు.
మహేశ్ వ్యక్తిగత జీవితానికి వస్తే 'వంశీ' సినిమాలో తనతో కలిసి నటించిన హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా గౌతమ్ కృష్ణ, సితార వంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అటు పర్సనల్ లైఫ్, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లను సమానంగా లీడ్ చేస్తున్న అతి తక్కువ మంది హీరోలలో మహేశ్ ఒకరని చెప్పొచ్చు. సినిమా షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా, కుదిరినప్పుడల్లా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుంటారు. అందుకే ఆయన్ని 'పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్' అంటుంటారు.
మహేశ్ అనే పేరులోనే ఏదో మ్యాజిక్ ఉందంటారు సినీ అభిమానులు. హాలీవుడ్ హీరోలను తలదన్నే పిజిక్ తో స్టన్నింగ్ లుక్స్ లో కనిపించే మహేశ్.. ఎప్పటికీ అమ్మాయిలకు కలల రాకుమారుడే. ఆయనకు ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. ఏళ్ళు గడిచే కొద్దీ మరింత హ్యాండ్సమ్ గా మారిపోతున్నాడు. తన తర్వాతి సినిమా SSMB29 కోసం దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళితో చేతులు కలిపారు. ఇప్పటిదాకా పాన్ ఇండియా గురించి ఆలోచించని మహేశ్ .. ఈసారి ఏకంగా గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా వేచి చూస్తున్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!