'భిక్షాటనను ప్రోత్సహించవద్దు' అంటూ ప్రచారం..

- June 17, 2016 , by Maagulf
'భిక్షాటనను ప్రోత్సహించవద్దు' అంటూ ప్రచారం..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను 'బెగ్గర్‌ ఫ్రీ' సిటీగా మార్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. నగరంలో అడుక్కునే వారుండకూడదనే యోచనతో ఆ సమస్య శాశ్వత పరిష్కారానికి కసరత్తు చేపట్టింది. యాచక వృత్తిని నిషేధించి అందులో ఉన్నవారిని ఆదుకోవడంతో పాటు వారికి పలు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు జీహెచ్ ఎంపీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది.యాచకులకు ఆశ్రయం కల్పించడంతో పాటు వారికి సదుపాయాలు సమకూర్చడం.. పని చేయగలిగిన వారికి అవకాశాలు కల్పించడం... వ్యాధి పీడితులుంటే చికిత్స చేయించడం వంటి కార్యక్రమాలతో ఆ వృత్తి నుంచి విముక్తి కల్పించాలని భావిస్తోంది. ఇన్ని చేసినా ఆ అలవాటు మానలేని వారిని ఆ 'దారి' నుంచి తప్పించేందుకు ఎవరూ వారికి ధర్మం చేయకుండా ప్రజల్లోనూ అవగాహన కల్పించాలని భావిస్తోంది.
బ్యానర్లు.. హోర్డింగ్‌ల ద్వారా 'భిక్షాటనను ప్రోత్సహించవద్దు' అంటూ ప్రచారం చేస్తోంది. ఇందుకోసం జీహెచ్ ఎంసీ కొద్దిరోజుల క్రితం ఓ సర్వే కూడా నిర్వహించింది. హైదరాబాద్ లో మొత్తం 14వేల మంది యాచకులు ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. అయితే 98 శాతం మంది నకిలీ బిచ్చగాళ్లేనట. ఇక వాళ్ల ఏడాది టర్నోవర్ ఎంతో తెలిస్తే కళ్లు తిరగాల్సిందే. బిచ్చగాళ్లు ఆదాయం ఏడాదికి రూ.24 కోట్లు పైమాటే. వీళ్లు అడుక్కోవటంతో పాటు డ్రగ్స్, వ్యభిచారం, మనీ లెండింగ్ ద్వారా కూడా సంపాదిస్తున్నారట. ఇక యాచకుల రోజువారి ఆదాయం హీనపక్షంగా చూసినా 2వేలు ఉంటుందట. కాగా నిజమైన యాచకులను గుర్తించి వారికి ప్రభుత్వం పునరావాసం కల్పించనుంది. అలాగే పలు స్వచ్ఛంద సంస్థలు కూడా బెగ్గర్ ఫ్రీ సిటీ సాకారాని చేయూత అందించేందుకు ముందుకు వస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com