సంస్కరణల ప్రధాని..!
- August 20, 2024
భారతదేశ ప్రధానుల్లో సాంకేతిక పరిజ్ఞానం పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఎవరు అంటే అందరూ టక్కున చెప్పే సమాధానం రాజీవ్ గాంధీ.నెహ్రూ కుటంబం నుంచి వచ్చి...అతి చిన్న వయసులోనే ప్రధాని అవడమే కాక భారతదేశంలో సమాచార విప్లవానికి ఆద్యుడు అయ్యారు రాజీవ్ గాంధీ. నేడు భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 80వ జయంతి.
రాజీవ్ గాంధీ 1944లో ఆగస్టు 20న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, ఫిరోజ్ గాంధీ దంపతులకు జన్మించారు. రాజకీయాల్లోకి రాకముందు రాజీవ్ గాంధీ ఇటలీలో ఉండేవారు. అక్కడే ఆయన సోనియాగాంధీని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. రాజీవ్ ఢిల్లీలోని ఫ్లయింగ్ క్లబ్లో విమానం నడిపేందుకు పైలట్గా శిక్షణ పొందారు. ఆ తర్వాత 1970లో ఎయిర్ ఇండియాలో పైలట్గా చేరారు. అంతేకాదు ఈయనకు ఫోటోగ్రఫీ అంటే కూడా చాలా ఇష్టం. అలాగే రాజీవ్కు కారు డ్రైవింగ్ అంటే కూడా విపరీతమైన మక్కువ. తాను రాజకీయ నాయకుడు, ప్రధాని అయిన తర్వాత కూడా తన కారును తానే స్వయంగా నడుపుకునే వారని చెబుతారు. ఇలా చేసింది రాజీవ్ గాంధీ తప్ప మరెవ్వరూ లేరని కూడా అంటారు.
1980ల్లో రాజీవ్ రాజకీయాల్లోకి వచ్చారు. తన తమ్ముడు సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ రాజకీయ ప్రవేశం చేశారు. ఆ తరువాత 1984లో ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత అంటూ నాలుగేళ్ళల్లోనే రాజీవ్ ప్రధాని అయ్యారు. దేశ చరిత్రలో అతి పిన్న వయస్సులో దేశ ప్రధానిగా ఎన్నికైన నేత రాజీవ్ గాంధీ ఒక్కరే. రాజీవ్ గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆయన వయస్సు కేవలం 40 ఏళ్ళు. అంతకు ముందు కానీ లేదా ఆ తర్వాత కానీ మళ్లీ అంత చిన్న వయస్సులో ఆ అవకాశం ఎవ్వరినీ వరించలేదు. కానీ నెహ్రూ వంశంలో ప్రధానిగా చేసిన మూడో వ్యక్తి రాజీవ్. నెహ్రూ, ఇందిరాగాంధీ తరువాత రాజీవ్ గాంధీని ఈ అవకాశం వరించింది.
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న కొన్నేళ్ళల్లోనే ఎన్నో సంస్కరణలు చేశారు. ఈరోజు భారతదేశంలో కంప్యూటర్లు, టెలీ కమ్యూనికేషన్ ఇవన్నీ ఇంత అభివృద్ధి చెందాయి అంటే అదంతా రాజీవ్ గాంధీ చలవే. కంప్యూటర్ రంగాన్ని మన దేశానికి పరిచయం చేసి ఎంతో మంది విద్యార్థులు దానిని నేర్చుకునేలా చేసింది రాజీవ్ గాంధీనే. సాంకేతిక పరిశ్రమపై పన్నులను తగ్గించే సంస్కరణలను ప్రవేశపెట్టారు. టెలీకమ్యూనికేషన్స్, రక్షణ, వాణిజ్య, విమానయాన సంస్థలకు సంబంధించిన దిగుమతి విధానాలను సంస్కరించారు. దీంతో పాటూ రాజీవ్ గాంధీ మనదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలీకమ్యూనికేషన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేశారు.
1984లో అప్పటి ప్రభుత్వం టెలీకమ్యూనికేషన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ అయిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ ను ప్రారంభించింది. మొదట్లో ఇది డిజిటల్ ఎక్స్ఛేంజీల రూపకల్పన, అభివృద్ధికి మాత్రమే ఉద్దేశించబడింది. రాజీవ్ సలహాదారుగా ఉన్న శ్యామ్ పిట్రోడా టెలీకమ్యూనికేషన్స్, నీరు, అక్షరాస్యత, రోగనిరోధకత, పాడి, చమురు విత్తనాలకు సంబంధించిన ఆరు టెక్నాలజీ మిషన్లకు నాయకత్వం వహించారు.
1984 తర్వాత ప్రభుత్వ సహాయంతో దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ల శ్రేణిని నిర్మించి, ఫోన్లను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది రాజీవ్ గాంధీనే. 1986లో ఢిల్లీ, ముంబై టెలిఫోన్ సేవలను పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది. అదే సంవత్సరంలో విదేశీ సమాచార నెట్వర్క్ లిమిటెడ్ ను స్థాపించింది.
రాజీవ్ తెచ్చిన అతి ముఖ్యమైన పాలసీల్లో ఇది ఒకటి. జాతీయ సమైక్యత, సాంస్కృతిక, ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ, కాలేజీ స్థాయిల వరకు విద్యను అందించడం లక్ష్యంగా 1968లో ఇందిర ప్రభుత్వం మొదటి నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత దాన్ని మరింత పొడిగిస్తూ రాజీవ్ గాంధీ అసమానతలను తొలగించడం, విద్యావకాశాల సమానత్వం, ముఖ్యంగా మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ 1986లో కొత్త నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ ను ప్రవేశపెట్టారు. 1986లోనే ఆపరేషన్ బ్లాక్బోర్డ్ ను ప్రవేశపెట్టి, 1987లో దానిని ప్రారంభించింది. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు వారి విద్యాభ్యాసాన్ని సులభతరం చేయడానికి అవసరమైన సంస్థాగత పరికరాలు, బోధనా సామగ్రిని అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఇదే సమయంలో రాజీవ్ గాంధీ అనేక కుంభకోనాల్లో కూడా ఇరుక్కున్నారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈ కేసులను ఆయన శ్రీమతి సోనియాగాంధీ ఎదుర్కోవలసి వచ్చింది. అన్నింటికంటే భోఫోర్స్ కుంభకోణం ఆ ఫ్యామిలీని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. దాంతో పాటూ మాల్దీవుల విషయంలో , శ్రీలంక తమిళుల విషయంలో ఆయన జోక్యం, తీసుకున్న నిర్ణయాలు రాజీవ్ మరణాన్ని శాసించాయి.
శ్రీలంక సైన్యానికి సపోర్టుగా, వేర్పాటువాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ) 1987లో అప్పటి ప్రధాని అయిన రాజీవ్ గాంధీ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ని పంపినందుకు.. ఈ ఫోర్స్ శ్రీలంక తమిళులపై దారుణాలకు తెగబడిందనే కోపంతో ఎల్టీటీఈ రాజీవ్ గాంధీని హత్య చేసింది.
1991లో మే21 పెరంబదూర్ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన ఆయనను శ్రీలంక టైగర్స్ ఆత్మాహుతి సభ్యురాలు పూలదండలో బాంబును పెట్టి తనను తాను పేల్చుకుంది. ఈ దాడిలో ఆయనతో పాటూ 14 మంది చనిపోగా…40 మంది గాయాలపాలయ్యారు. అప్పటి నుండి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆయన జయంతిని "సద్భావన దినోత్సవం" గా జరుపుకుంటున్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్