అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం..

- October 24, 2024 , by Maagulf
అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం..

అమరావతి: అమరావతి రైల్వే లైన్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2వేల 245 కోట్ల రూపాయలతో 57 కిలోమీటర్ల మేర అమరావతి రాజధానికి ఈ కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కాబోతోంది. అమరావతి నుంచి హైదరాబాద్, చెన్నై, కోల్ కతాకు నేరుగా అనుసంధానం చేస్తూ నిర్మించబోతున్నారు. మరోవైపు అమరలింగేశ్వర స్వామి, అమరావతి స్థూపం, ధ్యానబుద్ధ, ఉండవల్లి గుహలకు వెళ్లే వారికి మార్గం సులువు కాబోతోంది. ఇక మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు కూడా అనుసంధానిస్తూ నిర్మించబోతున్నారు.

మరో వైపు కృష్ణానది పై 3.2 కిలోమీటర్ల మేర పొడవైన బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. కొత్తగా నిర్మించే రైల్వే లైన్ ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు ఏర్పాటు చేస్తామన్నారు.

”కేంద్ర క్యాబినెట్ రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటి ఏపీ రాజధాని అమరావతికి రైల్వే లైన్. అక్కడ అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్నారు. రూ.2వేల 245 కోట్లతో 57 కిలోమీటర్ల మేర కొత్త లైన్ ఏర్పాటు చేస్తాం. కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల మేర వంతెన నిర్మిస్తాం.ఈ ప్రాజెక్ట్ హైరాబాద్, చెన్నై, కోల్ కతాకు అనుసంధానంగా ఉంటుంది. నాగ్ పూర్ నుంచి ఢిల్లీ, హైదరాబాద్ నుంచి ముంబై వరకు అన్ని మెట్రో నగరాలను కనెక్ట్ చేస్తూ అమరావతి వరకు కొత్త లైన్ ఉంటుంది. అమరలింగేశ్వర స్వామి, అమరావతి స్థూపం, ధ్యానబుద్ధ, ఉండవల్లి గుహలకు వెళ్లే వారికి మార్గం సులువు అవుతుంది. మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు కూడా అనుసంధానిస్తూ నిర్మిస్తున్నాం” అని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com