రోడ్లపై చెత్త వేసినా.. 40 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్‌ కవర్లు వినియోగించినా.. జరిమానా

- June 23, 2016 , by Maagulf
రోడ్లపై చెత్త వేసినా.. 40 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్‌ కవర్లు వినియోగించినా.. జరిమానా

హైదరాబాద్‌ సిటీ: రోడ్లపై చెత్త వేసినా.. 40 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్‌ కవర్లు వినియోగించినా.. జరిమానా విధిస్తామని జీహెచ్‌ఎంసీ హెచ్చరించింది. గురువారం నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేశారు. వ్యాపారుల నుంచి రూ. 3లక్షల అపరాధ రుసుం వసూలు చేశారు. వ్యాపారులు చెత్త డబ్బాలు ఏర్పాటుచేసి, ట్రాలీల్లో వేయాలని అధికారులు గతంలోనే సూచించారు. అయినా కొందరు వ్యాపారులు చెత్త సేకరణ కార్మికులకు నెలనెలా డబ్బు ఇవ్వాల్సి వస్తుందన్న సాకుతో రోడ్లపైనే వేస్తున్నారు. ఇటువంటి వారి విషయంలో కఠినంగా వ్యహరించాలని భావిస్తున్నారు. తొలగించిన ఓపెన్‌ గార్బెజ్‌ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలతో నిఘా పెట్టి.. చెత్త వేసే వారిని గుర్తించి జరిమానా విధిస్తామని చెబుతున్నారు. 40 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌ కవర్ల వినియోగంపైనా ఉక్కుపాదం మోపుతోంది. గ్రేటర్‌లోని పలు సర్కిళ్లలో దుకాణాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. శేరిలింగంపల్లిలో 111 మందికి రూ.81,959 జరిమానా విధించారు. సర్కిల్‌-15లో 56 మంది నుంచి రూ.41,800, 4-బిలో 20 మంది నుంచి రూ.30,500, సర్కిల్‌-18లో 73 మందినుంచి 21,900, ఈబీలో 34 మంది నుంచి 10,300, 3ఏలో రూ.9900, సర్కిల్‌-6లో 26 మంది నుంచి 15,200, 16లో 51 మంది నుంచి రూ.9450, సర్కిల్‌ -5లో 19 మంది నుంచి రూ.9550, 14ఏలో 42 మంది నుంచి రూ.8250, 17లో 27 మంది నుంచి రూ.7500, సర్కిల్‌-1, 2లో 20 మంది నుంచి రూ.5200, 7ఏలో 16 మంది నుంచి రూ.5600 జరిమానాగా వసూలు చేశారు. గ్రేటర్‌లో నిత్యం వెలువడుతోన్న వ్యర్థాల్లో 30శాతం ప్లాస్టిక్‌ ఉండడం వల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందని... దీనిని దృష్టిలో ఉంచుకొని 40 మైక్రాన్లలోపు కవర్లను వినియోగించవద్దని కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌ కవర్ల నిషేధానికి చట్టం తీసుకువచ్చిందని...గ్రేటర్‌లో ప్లాస్టిక్‌ నిషేధాన్ని కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com