తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టండి: సీఎం రేవంత్..

- January 10, 2025 , by Maagulf
తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టండి: సీఎం రేవంత్..

హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి సంబంధించి త‌మ‌కు ఒక క‌ల ఉంద‌ని, అదే రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణ‌గా తీర్చిదిద్ద‌డం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.హైటెక్ సిటీలోని సీఐఐ జాతీయ కౌన్సిల్ ను ఆయ‌న ప్రారంభించారు.ఈ సంద‌ర్భంగా మాట్లాడారు. జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించడం ఆనంద‌దాయ‌క‌మ‌న్నారు.

ఇత‌ర న‌గ‌రాల‌కు పోటీ ఇచ్చేలా నాలుగో న‌గ‌రం నిర్మాణం న్యూయర్క్ , లండన్, టోక్యో, సియోల్ , దుబాయ్ త‌దిత‌ర‌ నగరాలతో పోటీ ప‌డేలా హైదరాబాద్ లో ఫోర్త్ సిటీ నిర్మించ‌నున్న‌ట్లు సీఎం అన్నారు. భారతదేశంలోనే  గొప్ప న‌గ‌రంగా ఫ్యూచ‌ర్ సిటీని నిర్మించాలని అనుకుంటున్నామ‌ని, ఇందులో సేవా రంగం మాత్రమే ఉంటుంద‌ని చెప్పారు. ఫ్యూచర్ సిటీ  కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. 3200 ఈవీ బస్సులను ఆర్టీసీ లోకి తీసుకువస్తున్నామ‌న్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్నును  తొలగించామ‌న్నారు. భారతదేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత వేగంగా అమ్ముడవుతున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొవడానికి హైదరాబాద్ సిద్ధమ‌వుతుంద‌ని, వరదలు లేని నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దాలనుకుంటున్నామ‌ని అన్నారు.

2050 సంవత్సరానికి అవసరమయ్యే  తాగు నీటి అవసరాలకు కావాల్సిన కార్యాచ‌ర‌ణ‌ను ఇప్పటి నుంచే ప్రారంభించామ‌ని సీఎం తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్ ప్రణాళికల దశలో ఉంద‌ని చెప్పారు. 360 కి.మీ పొడవు రీజినల్ రింగ్ రోడ్ ను నిర్మిస్తున్నామ‌ని, దాని చుట్టూ రీజినల్ రింగ్ రైల్వేను ప్లాన్ చేస్తున్నామ‌ని అన్నారు. ఓఆర్ఆర్‌, ఆర్ఆర్ఆర్‌ల‌ను అనుసంధానించే రేడియల్ రోడ్లు కూడా నిర్మించబోతున్నామ‌ని తెలిపారు. ఓఆర్ఆర్‌, ఆర్ఆర్ఆర్ మ‌ధ్య త‌యారీ రంగానికి కేంద్రంగా ఉండ‌బోతుంద‌ని చెప్పారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీలు, సోలార్  వంటి పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయ‌న్నారు.  స్కిల్స్, ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించామ‌ని తెలిపారు.

హైదరాబాద్ ను చైనా కు ప్లస్ సిటీ  గా మార్చే వ్యూహంతో ముందుకు వెళుతున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  అవుటర్ రింగ్ రోడ్ బయట ఉన్న గ్రామీణ తెలంగాణ లో  వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగుల వంటి పైన  దృష్టి పెడ‌తామ‌న్నారు. తెలంగాణ కు తీరప్రాంతం లేద‌ని, అందుకే ఇక్కడ డ్రై పోర్ట్ ఏర్పాటు చేయనున్నామ‌ని చెప్పారు. ఏపీలోని బందర్ ఓడరేవు తో అనుసంధానం చేస్తూ ప్రత్యేక రహదారి తో పాటు రైల్వే కనెక్షన్ ఏర్పాటు చేయబోతున్నామ‌న్నారు. మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలని ,మార్కెట్లు స్వేచ్ఛ‌గా పనిచేయాలని కోరుకుంటున్నామ‌న్నారు.

తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు త‌మ‌తో క‌లిసి రావాల‌ని సీఎం పిలుపునిచ్చారు. పెట్టుబ‌డుల‌తో క‌ల‌సి రండి.. అద్భుతాలు సృష్టిద్దామ‌ని అన్నారు. ప్రపంచంలోనే అత్యున్నత వ్యాపార సౌలభ్యాన్ని అందిస్తాన‌ని చెప్పారు. ప్ర‌పంచంతో పోటీ ప‌డేలా తెలంగాణ విద్యార్థుల‌ను త‌యార చేస్తామ‌ని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com