ఇండస్ట్రీలో సీనియర్ నటుడు మృతి

- January 20, 2025 , by Maagulf
ఇండస్ట్రీలో సీనియర్ నటుడు మృతి

చెన్నై: టాలీవుడ్‌లో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. సీనియర్ నటుడు విజయ రంగరాజు మరణ వార్త సినీ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రంగస్థల కళాకారుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన రంగరాజు, తన ప్రతిభతో సినిమా రంగంలోకి అడుగుపెట్టి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు.విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. వారం క్రితం హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్‌లో గాయపడ్డ ఆయన, చికిత్స కోసం చెన్నై వెళ్లారు.

అక్కడ చికిత్స పొందుతుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు. విజయ రంగరాజుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.రంగస్థల నటుడిగా రాణించిన రంగరాజు, బాపు దర్శకత్వంలో వచ్చిన సీతా కళ్యాణం సినిమాతో తెరంగేట్రం చేశారు. కానీ, ఆయనకు గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన భైరవ ద్వీపం. ఈ సినిమాలో ఆయన ప్రతినాయక పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. ఇక యజ్ఞం చిత్రం ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. ఇందులో ప్రతినాయకుడిగా అదరగొట్టిన రంగరాజు, ఆ తర్వాత వరుస చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు.

విజయ రంగరాజు తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ గుర్తింపు పొందారు. ప్రతినాయకుడిగా, సహాయ పాత్రలలో తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్‌లో నైపుణ్యం కలిగిన రంగరాజు, తన శారీరక దారుఢ్యాన్ని పాత్రలకు అనుగుణంగా ఉపయోగించుకుని మరింత ప్రత్యేకతను చాటుకున్నారు.విజయ రంగరాజు మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన ప్రతిభ, నటన, వ్యక్తిత్వం తరం తరాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తాయి. సినీ అభిమానులు, సహ నటులు సోషల్ మీడియాలో ఆయన మరణం పై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com