నైమిశారణ్యంలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం

- February 08, 2025 , by Maagulf
నైమిశారణ్యంలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం

తిరుమల: ఉత్తర ప్రదేశ్ లోని నైమిశారణ్యంలో గల బాలాజీ ఆలయంలో శుక్రవారం ఉదయం శ్రీ శ్రీనివాస కల్యాణాన్ని టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహించింది.

ముందుగా తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణ శేషాచల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చక బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ స్వామి వారి ఉత్సవర్లను కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు.

అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహా సంకల్పం, మాంగళ్య పూజ, మంగళ సూత్రధారణ మొదలయిన ఘట్టాలతో శాస్త్రోక్తంగా శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని నిర్వహించారు.

చివరిగా శ్రీ స్వామి అమ్మవార్లకు నక్షత్ర హారతి, మంగళహారతి సమర్పించడంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తి పరవశంతో పులకించారు.

గోమతి నదీతీరంలో వైభవంగా చక్రస్నానం

మహా కుంభ మేళా సందర్భంగా నైమిశారణ్యంలోని గోమతి నదీ తీరంలో శుక్రవారం టీటీడీ వైభవంగా చక్రస్నానం నిర్వహించింది. ఉదయం 9 నుండి 10 గంటల మధ్య చక్రస్నానం ఘట్టం జరిగింది.

గోమతి నదీ తీరంలో చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం నిర్వహించారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్‌ ప్రసన్నుడయ్యాడు. అధికారులు, భక్తులు పుష్కరిణిలో పవిత్రస్నానాలు ఆచరించారు.

ఈ కార్యక్రమాల్లో టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ శివ ప్రసాద్, హెచ్ డీపీపీ అదనపు సెక్రటరీ శ్రీ రామ్ గోపాల్, ఏఈవో శ్రీ రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com