తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి పొన్నం

- March 07, 2025 , by Maagulf
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి పొన్నం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శభవార్త చెప్పింది.యాజమాన్యంతో చర్చించి ఆర్టీసీ ఉద్యోగులకు 2.5శాతం డీఏ ప్రకటిస్తున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. డీఏ ప్రకటనతో ప్రతినెలా ఆర్టీసీపై రూ.3.6కోట్ల అదనపు భారం పడుతుందని అన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ ‘ఎక్స్’ వేదికగా ఆర్టీసీ ఉద్యోగులకు 2.5శాతం డీఏ విషయాన్ని ప్రకటించారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తరువాత ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, దాదాపు 5వేల కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినట్లు మంత్రి వెల్లడించారు. మహా లక్ష్మి పథకం ప్రారంభం తరువాత దాదాపు ప్రతిరోజూ 14 లక్షల మహిళలు అదనంగా ప్రయాణం చేస్తున్నారని, దీనివల్ల ఉద్యోగులపై పనిఒత్తిడి పెరిగినా.. వారు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తుందని, మహిళా ప్రయాణికులు అదనంగా పెరగడంతో ఆర్టీసీ బస్సుల డిమాండ్ పెరిగిందని మంత్రి తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా మొదటిసారి మహిళా సంఘాల చేత ఆర్టీసీ బస్సులు అద్దె ప్రాతిపదికన పెట్టి బస్సులకు యజమానులను చేస్తూ మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా వివిధ పథకాలు ఇప్పటికే ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా మొత్తం 600 బస్సులు మహిళా సమైక్య సంఘాల ద్వారా ఆర్టీసీతో అద్దె ప్రాతిపదికన ఒప్పందం జరగగా.. రేపు మహిళా దినోత్సవం సందర్భంగా మొదటి దశలో 150 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారని మంత్రి పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com