గాలివానకు అల్లకల్లోలమైన ఏ.పి
- May 01, 2018అమరావతి:ఈదురు గాలులు, అకాలవర్షంతో ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలమయ్యింది. కోస్తాంధ్ర జిల్లాల్లో మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. విజయవాడ, అమరావతి, గుంటూరుల్లో అయితే.. సాయంత్రం నాలుగింటికే చీకట్లు కమ్ముకున్నాయి. దట్టమైన మేఘాలు అలుముకోవడంతో పాటు పలుచోట్ల పిడుగులు కూడా పడడంతో జనం భయాందోళనకు గురయ్యారు.
అమరావతి సచివాలయ ప్రాంతంలో సాయంత్రమే చీకటైపోయింది. దట్టమైన మేఘాలు ఒక్కసారిగా కమ్మేయడంతో.. అమరావతి ప్రాంతమంతా అంధకారంలోకి వెళ్లిపోయింది. ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురవడంతో సచివాలయం దగ్గర ఉన్న వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
గుంటూరులోనూ ఇదే పరిస్థితి. ఉరుముల శబ్దాలతో నగరమంతా హోరెత్తిపోయింది. పిడుగులు పడుతుండడంతో జనం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈదురు గాలులు, వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేయడంతో.. గుంటూరు అంతా చీకటిమయం అయ్యింది.
పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులకు పెదవేగి మండలంలో తాటి చెట్టు విరిగిపడింది. రోడ్డుపై వెళ్తున్న బైక్పై పడడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. జంగారెడ్డి గూడెంలో మామిడి, జీడిమామిడి తోటలతో పాటు, పొగాకు, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం జరిగింది.
ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పిడుగులు ఉధృతంగా పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పార్వతీపురం, కురుపాం, గజపతినగరం, ఇచ్చాపురం, పలాస, ఆమదాలవలస, శ్రీకాకుళంలోనూ ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. విశాఖలో మధ్యాహ్నానికి వర్షం తగ్గడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.
తాజా వార్తలు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!
- మరోసారి బహిరంగ క్షమాపణలు తెలిపిన రాందేవ్ బాబా
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ