విజయవాడ నుంచి దుబాయ్ సర్వీసు!వారానికి రెండు రోజులు నడిపే అవకాశం
- February 04, 2019విజయవాడ నుంచి దుబాయ్కి విమాన సర్వీసు ప్రక్రియ ఊపందుకుంది. మరో నెల రోజుల్లో దుబాయ్ సర్వీసు ప్రారంభమయ్యే అవకాశం కన్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ(ఏపీఏడీసీఎల్) ఆధ్వర్యంలో బిడ్లను ఆహ్వానిస్తూ జనవరి 23న నోటిఫికేషన్ను విడుదల చేసి ఫిబ్రవరి 02 వరకూ స్వీకరించారు. అతి తక్కువకు బిడ్ను దాఖలు చేసిన విమానయాన సంస్థకు అవకాశం కల్పించనున్నారు. ఫిబ్రవరి 11న విమానయాన సంస్థల ప్రతినిధుల సమక్షంలోనే బిడ్లను తెరిచి తక్కువకు కోట్ చేసిన సంస్థను ఎంపిక చేస్తారు. అనంతరం నెల రోజుల వ్యవధిలో దుబాయ్ కి సర్వీసు ఆరంభమయ్యే అవకాశం ఉంది. గతంలో సింగపూర్కు సర్వీసును నడిపినప్పుడు కూడా ఇలాగే తొలుత బిడ్లను ఆహ్వానించి అనంతరం ఇండిగోను ఎంపిక చేశారు. దుబాయ్ కి సర్వీసును ఏర్పాటు చేస్తే.. సింగపూర్ కంటే రద్దీ రెట్టింపు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
దుబాయ్ కి సర్వీసులను నడిపేందుకు ప్రజాభిప్రాయ సేకరణను ఏపీఏడీసీఎల్ చేపట్టింది. గతంలో సింగపూర్కు సర్వీసును ఆరంభించే ముందు కూడా ఇలాగే సర్వే చేపట్టారు. తాజాగా దుబాయ్ కి నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు మంచి స్పందన వచ్చింది. ఏపీఏడీసీఎల్ వెబ్సైట్తో పాటూ ఈమెయిల్, వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా సర్వేను చేపట్టారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు విదేశాలలో ఉండే ప్రవాసాంధ్రుల నుంచి మద్దతుగా పెద్దఎత్తున స్పందన వచ్చింది. ఏపీఏడీసీఎల్ వెబ్సైట్లోనే 2,42,594 మంది దుబాయ్ సర్వీసుకు ఓటేశారు. 950 మంది ఈమెయిళ్ల ద్వారా తమ సమ్మతిని తెలిపారు. మరో 25 మంది వాట్సాప్, 30 మంది ఎస్ఎంఎస్ల ద్వారా ఆసక్తిని తెలియజేశారు. ఫిబ్రవరి 2 వరకూ వచ్చిన ఈ స్పందనను చూసిన రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ వెంటనే బిడ్లను ఆహ్వానించింది. బిడ్లను దాఖలు చేసిన విమానయాన సంస్థల్లో.. వయబులిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్)ను అత్యంత తక్కువకు కోట్ చేసిన వారిని ఎంపిక చేయనున్నారు.
బుధ, శుక్రవారాల్లో ఉండొచ్చు..
దుబాయ్ సర్వీసును బుధ, శుక్రవారాల్లో వారంలో రెండు రోజులు నడపాలని భావిస్తున్నారు. ప్రస్తుతం సింగపూర్కు నడుస్తున్న అంతర్జాతీయ సర్వీసులు మంగళ, గురువారాల్లో గన్నవరం నుంచి నడుస్తున్నాయి. అందుకే.. బుధ, శుక్రవారాల్లో నడపాలని భావిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి దుబాయ్ కి సర్వీసును ఆరంభిస్తే.. స్పందన భారీగా ఉండబోతోంది. సింగపూర్కు వీసాల సమస్య ఎదురవుతోంది. దీంతో ఆరంభంలో సర్వీసులు సగం వరకూ నిండేవి. ప్రస్తుతం 70శాతం పైగా నిండుతున్నాయి. దుబాయ్ కి సింగపూర్ మాదిరిగా వీసా సమస్య లేదు. అమెరికా వీసా ఉన్న ప్రతి ఒక్కరూ దుబాయ్ కి నేరుగా వెళ్లిపోవచ్చు. అమెరికా వీసా ముద్ర ఉంటే.. దుబాయ్ కి ప్రత్యేకంగా అవసరం లేదు. దానితోనే వెళ్లిపోవచ్చు. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అత్యధికులకు అమెరికా వీసాలున్నాయి. దీనికితోడు కొత్తగా వీసా అవసరమైన వారికి అత్యంత తేలికగా దుబాయ్ అందిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రమైన దుబాయ్ కి వెళ్లి వచ్చేవారు ఈ ప్రాంతం నుంచి భారీగా ఉంటారు. ప్రపంచంలోని ఏ దేశానికైనా అత్యంత తేలికగా దుబాయ్ నుంచి వెళ్లిపోయేందుకు వీలుంటుందని, అందుకే ఆరంభం నుంచే రద్దీ ఉండబోతోందని గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి మండలి సభ్యులు ముత్తవరపు మురళీకృష్ణ వెళ్లడించారు. ఇలా వచ్చేవారికి సమయం ఆరేడు గంటలు మిగలబోతోందన్నారు. చెన్నై, హైదరాబాద్కు వెళ్లి రావాల్సిన అవసరం లేకుండా.. నేరుగా గన్నవరంలో దిగిపోవచ్చన్నారు. గన్నవరం నుంచి దుబాయ్ సర్వీసును ఆరంభించాలంటూ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ తరఫున చాలాకాలంగా కోరుతున్నామని, ఇన్నాళ్లకు ఆ కల నెరవేరుతుండటంతో ఈ ప్రాంత వాసులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతోందన్నారు.
దుబాయ్ సర్వీసు కావాలంటూ విజ్ఞప్తులిలా..
ఏపీఏడీసీఎల్ వెబ్సైట్ ద్వారా: 2,42,594మంది
ఈమెయిళ్ల ద్వారా: 950మంది
వాట్సాప్లో: 25మంది
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?