విదేశాల నుంచి ఇండియాకు నగదు.. రికార్డు సృష్టించిన భారత్..

- April 09, 2019 , by Maagulf
విదేశాల నుంచి ఇండియాకు నగదు.. రికార్డు సృష్టించిన భారత్..

విదేశాల నుంచి భారత్‌కు నగదు పంపే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. 2018లో వివిధ దేశాల నుంచి 79 బిలియన్‌ డాలర్లు భారత్‌కు చేరినట్లు ప్రపంచబ్యాంకు నివేదిక తెలిపింది. దీంతో డాలర్ల రూపంలో అత్యధికంగా జమ అయిన దేశంగా మొదటి స్థానంలో నిలిచింది. భారత్‌ తర్వాత 67 బిలియన్‌ డాలర్లతో చైనా, మెక్సికో 36 బిలియన్‌ డాలర్లతో మూడోస్థానంలోనూ, ఫిలిప్పీన్స్‌ 34 బిలియన్‌ డాలర్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి. 29 బిలియన్‌ డాలర్లతో ఈజిప్టు ఐదో ప్లేస్ లో ఉంది.

 
గత మూడేళ్లుగా డాలర్ల రూపంలో భారత్‌కు వస్తున్న నగదు పెరుగుతోంది. 2016లో 62.7 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, 2017 నాటికి ఆ మొత్తం 65.3 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2018లో ఏకంగా 79 బిలియన్‌ డాలర్లకు చేరింది. విదేశాల నుంచి నగదు పంపే వారి సంఖ్య 14శాతం పెరిగినట్టు నివేదిక లెక్కలేసింది. కేరళ వరదల్లో సర్వం కోల్పోయిన తమ వారిని ఆదుకునేందుకు అనేక మంది పెద్ద మొత్తంలో సొమ్మును భారత్‌కు పంపారు ఇది కూడా పెరగడానికి ఓ కారణమని ప్రపంచ బ్యాంకు తెలిపింది.

మరోపక్క పొరుగుదేశం పాకిస్థాన్‌కు విదేశాల నుంచి నగదు పంపే వారి సంఖ్య కేవలం 7శాతం మాత్రమే. తక్కువ, మధ్య స్థాయి ఆదాయం కలిగిన దేశాలకు 2017లో 483 బిలియన్‌ డాలర్లు వచ్చి చేరగా, 2018లో 9.6శాతం వృద్ధి రేటుతో అత్యధికంగా 529 బిలియన్‌ డాలర్లు జమ అయినట్టు తెలుస్తోంది. అత్యధిక ఆదాయం కలిగిన దేశాల్లో ఇది 633 బిలియన్‌ డాలర్ల నుంచి 689 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com