APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..

- March 27, 2025 , by Maagulf
APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. ఎండ వేడితోపాటు వడగాల్పులు తోడవుతుండటంతో మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఏపీలో ఎండల తీవ్రత పెరిగింది.తాజాగా..APSDMA (ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ఏపీలో ఇవాళ 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని, 199 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని APSDMA రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపు 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 186 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది.ఇవాళ (గురువారం) శ్రీకాకుళం జిల్లాలోని 13 మండలాల్లో, విజయనగరం జిల్లాలో 14, పార్వతీపురంమన్యం జిల్లాలో 11, అనకాపల్లి జిల్లాలో రెండు, కాకినాడ జిల్లాలో నాలుగు, తూర్పుగోదావరి జిల్లాలో రెండు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలాల్లో ఇలా మొత్తం 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

ఇదిలాఉంటే.. బుధవారం సిద్ధవటంలో 40.8డిగ్రీలు, కమ్మరచేడులో 40.7 డిగ్రీలు, నిండ్రలో 40.1 డిగ్రీలు, మంగనెల్లూరులో 40 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు APSDMA పేర్కొంది.

ఎండవేడి నుంచి రక్షణ పొందేందుకు ఈ జాగ్రత్తలు తీసుకోండి..
♦ దాహం వేయకపోయినా తరచూ నీరు తాగండి. హైడ్రేటెడ్ గా ఉండండి.
♦ ఓఆర్ఎస్, నిమ్మరసం, మజ్జి లేదా పండ్ల రసాలను తీసుకోవాలి.
♦ వదులుగా, తేలిగ్గా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి.
♦ పుచ్చకాయ, దోసకాయ, నారింజ వంటి నీరు అధికంగా ఉండే పండ్లను తీసుకోండి.

ఇవి చేయొద్దు..
♦ ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3గంటల వరకు బయటకు రావొద్దు. ఒకవేళ వచ్చిన ఎండవేడిమి నుంచి రక్షణ పొందేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
♦ మధ్యాహ్నం వేళల్లో ఎండలో అధిక శారీరక శ్రమతో కూడిన పనులకు దూరంగా ఉండండి.
♦ ఆల్కహాల్, టీ, కాఫీ వంటి వాటికి దూరంగా ఉండండి.
♦ ఉప్పు, కారం, నూనె అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. నిల్వ ఉన్న ఆహారాలను తినకండి.

మరోవైపు.. దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి నెల ప్రారంభం నుంచే ఏపీ, తెలంగాణ; ఛత్తీస్ గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లో బుధవారం 40.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో నంద్యాల జిల్లాలో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండుమూడు రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com