శ్రీవారి మెట్టు మార్గాన కాలినడకన వెళ్లే భక్తులకు టోకెన్ల జారీ ప్రారంభం

- June 06, 2025 , by Maagulf
శ్రీవారి మెట్టు మార్గాన కాలినడకన వెళ్లే భక్తులకు టోకెన్ల జారీ ప్రారంభం

తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనార్థం శ్రీవారి మెట్టు మార్గాన కాలినడకన వెళ్లే భక్తులకు శుక్రవారం సాయంత్రం నుండి అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో దివ్యదర్శనం టోకెన్ల జారీని టిటిడి ప్రారంభమైంది.

ఈ సందర్భంగా అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారి మెట్టు దివ్యదర్శనం టోకెన్ కేంద్రాన్ని శ్రీవారి మెట్టు నుండి అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌కు మార్చడంపై భక్తుల నుండి స్పందన అపారమని అన్నారు.

శ్రీనివాస మంగాపురం ఆలయంలో కౌంటర్లను ఏర్పాటు చేయడానికి భారత పురావస్తు శాఖ (ASI) అనుమతి రావాల్సి ఉందన్నారు.ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుండటంతో భక్తుల సౌకర్యార్థం టోకెన్ కౌంటర్లను తాత్కాలికంగా భూదేవి కాంప్లెక్స్‌కు మార్చామన్నారు. భూదేవి కాంప్లెక్స్ లో ఇప్పటికే పూర్తిస్థాయిలో ఎస్ ఎస్ డి టోకెన్లను జారీ చేసే మౌలిక సదుపాయాలు, మానవవనరులు ఒకే చోట చాలా కాలంగా ఉండడం వల్ల ఇక్కడ నుండి జారీ  చేస్తున్నామన్నారు.

శ్రీవారి మెట్టు డీడీ టోకెన్లను జారీ చేయడానికి నాలుగు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామని, టీటీడీ ఏర్పాట్లపై భక్తులు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.
రవాణా వ్యవస్థ కూడా బాగా ఉందని, బస్ స్టాండ్ కూడా అలిపిరిలోనే ఉందన్నారు. కాబట్టి భక్తులు శ్రీవారి మెట్టు చేరుకోవడానికి సౌకర్యంగా ఉంటుందని ఆయన తెలిపారు.
భక్తులకు సేవలు అందించడానికి శ్రీవారి సేవా వాలంటీర్లతో పాటు పరిపాలనా, నిఘా, అదనపు పారిశుధ్య సిబ్బందిని నియమించామన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా డీడీ టోకెన్లను జారీ చేయడానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసిందన్నారు.ఈ కార్యక్రమంలో జేఈఓ వి. వీరబ్రహ్మం, సీవీ&ఎస్ఓ కె.వి. మురళీకృష్ణ మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com