విశాఖలో యోగా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన సీఎం చంద్రబాబు
- June 16, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటించారు. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ‘యోగాంధ్ర’ పేరుతో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను ఆయన స్వయంగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నిశ్చయించుకుంది.విశాఖపట్నం బీచ్ రోడ్డులో యోగా ప్రాంగణాన్ని తయారు చేస్తుండగా, సీఎం చంద్రబాబు అక్కడి వేదిక, వసతుల ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి యోగా దినోత్సవానికి సంబంధించి నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి సమీక్షించారు.
ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ, “ప్రధాని మోదీ వచ్చేది చాలా గౌరవకరమైన విషయమని, విశాఖ ప్రతిష్టను మరింత పెంచే ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవాలని” అధికారులకు సూచించారు.‘యోగాంధ్ర’ పేరుతో జరిగే ఈ కార్యక్రమానికి సుమారు ఐదు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. యోగాంధ్ర 2025 నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు, యోగా దినోత్సవం కోసం చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రికి వివరించారు.అలాగే, బీచ్ రోడ్డు వెంబడి వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని విశాఖ జిల్లా కలెక్టర్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
607 సచివాలయాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హాజరవుతున్నారని, వారిని సమన్వయం చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనే వారితో ముందుగా మాక్ యోగా (Mock yoga) నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమం జరిగే రోజు ఉదయం 6:30 గంటల నుంచి 8:00 గంటల వరకు ఈ మాక్ యోగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రితో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందున భద్రతాపరంగా తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా, సామాన్య ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చేవారి వాహనాల పార్కింగ్ కోసం చేసిన ఏర్పాట్ల గురించి కూడా సీఎం ఆరా తీశారు. ఆర్కే బీచ్లోని ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్కు వెళ్లి అక్కడ కూడా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తాజా వార్తలు
- పిల్లల స్క్రీన్ టైమ్పై జాగ్రత్త.. నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన యూఎన్ఎస్సీ.. బహ్రెయిన్ స్వాగతం..!!
- దుబాయ్లో నాన్ ముస్లిం ప్రవాసుల వివాహం.. అర్హతలు, ప్రక్రియ..!!
- ఒమన్లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు, వడగళ్లకు అవకాశం.. 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- సైనిక స్థావరాల్లో రక్షణ మంత్రి తనిఖీలు.. సైన్యం సన్నద్ధతపై సమీక్ష..
- దుబాయ్లో కొత్త అల్ ఖుద్రా బ్రిడ్జి ప్రారంభం..
- బోనాల ఉత్సవాల్లో AI కెమెరాలతో అప్రమత్తమైన నిఘా:సీపీ సజ్జనార్
- రియాద్లో మృత్యువుతో పోరాడుతున్న ఏపీ వాసి.. లక్ష్మీనారాయణకు తెలుగు సంఘాల అండ
- వైజాగ్ సినీ ప్రియులకు గుడ్ న్యూస్..







