బ్రిటన్లో భారతీయ సంస్థల హవా
- June 19, 2025
భారత్, బ్రిటన్ మధ్య ఆర్థిక భాగస్వామ్యం మరింత బలపడుతోందని చెప్పడానికి నిదర్శనంగా, బ్రిటన్లో పనిచేస్తున్న భారతీయ యాజమాన్యంలోని కంపెనీల సంఖ్య గణనీయంగా పెరిగింది. గురువారం విడుదలైన ఒక నివేదిక ప్రకారం 2024లో 971గా ఉన్న ఈ సంస్థల సంఖ్య, 2025 నాటికి 23 శాతానికి పైగా వృద్ధితో 1,197కు చేరింది. 2017లో గ్రాంట్ థోర్న్టన్ సంస్థ కచ్చితమైన సంఖ్యలను ట్రాక్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇదే అత్యధిక పెరుగుదల కావడం విశేషం. ఈ భారతీయ కంపెనీలు యూకేలో సంపాదించిన మొత్తం ఆదాయం కూడా 2024లోని 68.09 బిలియన్ పౌండ్ల నుంచి 72.14 బిలియన్ పౌండ్లకు పెరిగింది. ఈ వ్యాపార సంస్థలు యూకే వ్యాప్తంగా 1,26,720 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. గత ఏడాది కాలంలోనే 8,000కు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించాయి.
ఏడాది అత్యంత వేగంగా అభివృద్ధి
“ఈ కంపెనీలలో మహిళా డైరెక్టర్ల నిష్పత్తి కూడా 2024లో 21 శాతం ఉండగా, అది 24 శాతానికి పెరిగింది. ఈ ఏడాది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీల జాబితాలో 74 సంస్థలు 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఆదాయ వృద్ధిని నమోదు చేశాయి” అని నివేదిక ప్రస్తావించింది. గ్రాంట్ థోర్న్టన్ భాగస్వామి, సౌత్ ఏషియా బిజినెస్ గ్రూప్ హెడ్ అనుజ్ చండే మాట్లాడుతూ… “ఈ ఏడాది ‘ఇండియా మీట్స్ బ్రిటన్ ట్రాకర్’ నివేదికలోని అంశాలు ఈ రెండు గొప్ప దేశాల మధ్య ఉన్న లోతైన, చారిత్రక సంబంధానికి నిదర్శనం. భారతీయ కంపెనీలు వృద్ధి చెందడానికి యూకేను ఒక కీలక పెట్టుబడి కేంద్రంగా భారత్ చూస్తోందని స్పష్టమవుతోంది” అని తెలిపారు.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సహకారంతో రూపొందిన ఈ నివేదిక, ఇండియా గ్లోబల్ ఫోరం (ఐజీఎఫ్) చేరికతో మరింత బలోపేతమైంది. ఐజీఎఫ్ తన దీర్ఘకాల అనుభవం, నైపుణ్యం, భారత్-యూకే కారిడార్లో ఉన్న పలుకుబడితో ఈ నివేదికకు మరింత విలువ చేకూర్చింది. లండన్లోని క్వీన్ ఎలిజబెత్-II సెంటర్లో ఐజీఎఫ్ లండన్ ఫ్లాగ్షిప్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ప్రత్యేక ప్రారంభ సెషన్లో యూకే వాణిజ్య, వ్యాపార శాఖ మంత్రి జోనాథన్ రేనాల్డ్స్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ నివేదికను అధికారికంగా విడుదల చేశారు.
వృద్ధి ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో విప్రో ఐటీ
“విప్రో ఐటీ సర్వీసెస్ యూకే సొసైటాస్ 448 శాతం ఆదాయ వృద్ధితో వృద్ధి ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచింది. కొత్తగా ప్రవేశించిన కార్పొరేట్ ఐటీ మేనేజ్మెంట్ సంస్థ జోహో కార్పొరేషన్ లిమిటెడ్ 197 శాతం వృద్ధితో తర్వాతి స్థానంలో ఉంది” అని నివేదిక పేర్కొంది. కంపెనీల ప్రధాన కార్యాలయాల పరంగా చూస్తే, లండన్ మొదటి చాయిస్గా కొనసాగుతోంది. మొత్తం కంపెనీలలో 47 శాతం లండన్లోనే ఉన్నాయి.ఆ తర్వాత సౌత్ ఆఫ్ ఇంగ్లాండ్ (24.3 శాతం) ఉంది. రంగాల వారీగా చూస్తే, టెక్నాలజీ, మీడియా, టెలికమ్యూనికేషన్స్ (టీఎంటీ) రంగం 31 శాతం ట్రాకర్ కంపెనీలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!