డొనాల్డ్‌ ట్రంప్‌ తీరు పై చైనా ప్రతినిధి గెంగ్ షువాంగ్ అసహనం

- August 01, 2025 , by Maagulf
డొనాల్డ్‌ ట్రంప్‌ తీరు పై చైనా ప్రతినిధి గెంగ్ షువాంగ్ అసహనం

అమెరికా: అమెరికా తీరుపై, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీరు పై చైనా ఆగ్రహం వ్యక్తంచేసింది. రష్యా తో వాణిజ్యం చేయొద్దంటూ అమెరికా ప్రపంచ దేశాలను హెచ్చరించడంపై తీవ్రంగా మండిపడింది. తమ హెచ్చరికలను పెడచెవిన పెడితే భారీగా ఆంక్షలు విధిస్తామని ట్రంప్ పదేపదే హెచ్చరికలు జారీ చేస్తుండటంపై చైనా అసహనం వ్యక్తం చేసింది.అమెరికా దుర్నీతిని చైనా ఎండగట్టింది.మిగతా దేశాల సంగతి పక్కన పెడితే.. రష్యాతో అమెరికానే భారీగా వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తోందని ఆరోపించింది. ఈరోజు వరకు కూడా రష్యాతో అమెరికా వాణిజ్యం కొనసాగుతోందని తెలిపింది. ‘రష్యాతో ఇతరులు వాణిజ్యం చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పా’ అని అమెరికాను ఐక్యరాజ్య సమితిలో చైనా శాశ్వత ప్రతినిధి గెంగ్ షువాంగ్ నిలదీశారు.

కాగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ మొత్తంలో టారిఫ్‌లు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ఈ హెచ్చరికలపై గెంగ్ షువాంగ్ స్పందిస్తూ.. మిగతా దేశాల కంటే అమెరికానే ఎక్కువగా రష్యాతో వ్యాపారం చేస్తోందన్నారు. ఉక్రెయిన్‌కు కానీ, రష్యాకు కానీ తాము ఆయుధాలు సరఫరా చేయడంలేదని, అంతర్జాతీయ చట్టాలకు లోబడి వాణిజ్యం మాత్రమే చేస్తున్నామని తెలిపారు. భద్రతా మండలిలో చైనాపై అమెరికా ప్రతినిధి చేసిన ఆరోపణలను గెంగ్ షువాంగ్ తోసిపుచ్చారు. రష్యా, ఉక్రెయిన్‌తో తమ వాణిజ్య కార్యకలాపాలు అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఉన్నాయని, ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని తెలిపారు.ఇతరులపై నిందలు వేయడం మానుకోవాలని అమెరికాకు హితవు పలికారు. అదేవిధంగా ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలకడానికి ఇదే సరైన సమయమని, అందుకు కృషి చేయాలని ట్రంప్‌కు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com