రాష్ట్రానికి ప్రత్యేక హోదా త్వరగా ఇవ్వవలసిందిగా ప్రధానిని కోరిన చంద్ర బాబు

- July 16, 2016 , by Maagulf
రాష్ట్రానికి ప్రత్యేక హోదా త్వరగా ఇవ్వవలసిందిగా ప్రధానిని కోరిన చంద్ర బాబు

ప్రధాని నరేంద్ర మోడీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ప్రధాని మోడీ చొరవ ప్రదర్సించాలని ఆయన అన్నారు. శనివారం జరిగిన అంతర్రాష్ట్ర మండలి ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
గత ప్రధాని రాజ్యసభలో ఎపికి ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేయాలని ఆయన కోరారు. తన కోర్కెల చిట్టాను కూడా ఆయన సమావేశంలో విప్పారు. రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందని, ఆస్తులూ అప్పుల పంపకాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా జరిగాయని ఆయన విమర్శించారు.
తమ రాష్ట్రానికి రాజధాని లేదని, ఎపికి పలు ఇబ్బందులున్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేంద్రం ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని ఆయన కోరారు. పారిశ్రామికాభివృద్ధికి పన్ను మినహాయింపు ఇవ్వాలని కూడ ఆయన విజ్ఞప్తి చేశారు. మౌలిక వసతుల ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కూడా కోరారు.
నదీ జలాల వాడకంలో ఎపికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇప్పటి వరకు కృష్ణాగోదావరి నదుల నిర్వహణ బోర్డులను వేయలేదని ఆయన అన్నారు. విశాఖపట్నాన్ని ప్రత్యేక రైల్వే జోన్‌గా ప్రకటించాలని ఆయన కోరారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్ర విభజనలో సర్కారియా కమిషన్‌, ఫూంచ్‌ కమిషన్‌ సిఫార్సులను యూపీఏ ప్రభుత్వం పక్కన పెట్టిందని, రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను పట్టించుకోలేదని విమర్శించారు. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాన్ని కూడా క్లిష్టతరం చేశారని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందేవరకు ఏపీకి ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని సీఎం కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com