ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సౌదీ తెలుగు ప్రవాసీయులు

- August 14, 2025 , by Maagulf
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సౌదీ తెలుగు ప్రవాసీయులు

అమరావతి: సౌదీ అరేబియాలో సంఖ్యాపరంగా ఎక్కువగానే ఉన్నప్పటికీ, సంఘాల పరంగా చాలా కాలం నిమిత్తమాత్రంగానే ఉన్న తెలుగు ప్రవాసీ లోకం, ఇటీవల ఒక్కసారిగా చురుకుగా మారి సౌదీ మాత్రమే కాకుండా అన్ని గల్ఫ్ దేశాలలోనూ విశేషమైన ప్రాధాన్యం సంపాదించింది. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కష్టకాలంలో ఉన్న తోటి తెలుగు వారికి సాయం అందించడంలోనూ ముందుండి, “మానవ సేవే మాధవ సేవ” అనే ధ్యేయంతో ముందుకు సాగుతున్న సాటా, సాటా సెంట్రల్ వంటి తెలుగు ప్రవాసీ సంఘాలు ఈ కీర్తి అందుకున్నాయి.

రాజకీయ పరంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీతో పాటు అన్ని పార్టీల అభిమానులు కూడా ఈ సంఘాలలో చురుకుగా పాల్గొంటున్నారు. రాజధాని రియాధ్ కేంద్రంగా కీలకంగా పనిచేస్తున్న సాటా సెంట్రల్ ప్రతినిధులు మంగళవారం అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. సాటా సెంట్రల్ కీలక నాయకుడు, ఒంగోలు నగరానికి చెందిన ముజ్జమ్మీల్ షేఖ్, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు గడ్డం శిల్పతో కలిసి సీఎం చంద్రబాబుకు సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీయుల పరిస్థితులు, వారి సేవా కార్యక్రమాలను వివరించారు.

సువిశాల ఎడారి దేశంలో తెలుగువారికి ఒక ఆశాకిరణంలా సాటా సెంట్రల్ పనిచేస్తోందని, భారతీయ ఎంబసీ మరియు సౌదీ ప్రభుత్వ సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అమరావతిలోని ఏపీ ఎన్నార్టీ సంస్థతో సమన్వయంగా పని చేస్తున్నామని ముజ్జమ్మీల్ షేఖ్ తెలిపారు. ఏపీ ఎన్నార్టీ చైర్మన్ వేమూరి రవి, తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రాధాకృష్ణ అందిస్తున్న సహకారం కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో మహిళల పాత్ర ప్రాముఖ్యాన్ని గడ్డం శిల్ప సీఎం చంద్రబాబుకు వివరించారు. కొన్ని రోజుల క్రితం తాను కలిసిన శిల్పను గుర్తు పట్టిన ముఖ్యమంత్రి, ఆమెను అభినందించి, సౌదీ పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానాన్ని స్వీకరించారు. పార్టీ పునాదులను బలపరచడం, తెలుగు జాతి గౌరవాన్ని పెంపొందించడంలో ప్రవాసీ మహిళలు మరింత చురుకుగా ఉండాలని సీఎం సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com