భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- September 10, 2025
భారత ప్రధాని నా స్నేహితుడు.. భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించుకునేందుకు చర్చలు కొనసాగుతున్నాయి.. మోదీతో మాట్లాడేందుకు నేను ఎదురు చూస్తున్నా అంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సోషల్ ట్రూత్లో పోస్టు పెట్టారు. ట్రంప్ పోస్టుకు భారత ప్రధాని నరేంద్ర మోదీసైతం స్పందించారు. నేను కూడా ట్రంప్ తో మాట్లాడటానికి ఎదురుచూస్తున్నా. రెండు దేశాల భవిష్యత్తు కోసం మేము కలిసి పనిచేస్తాం అంటూ మోదీ పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. మరోవైపు.. భారతదేశంపై ట్రంప్ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నాడు. భారత్, చైనా దేశాలపై సుంకాల భారాన్ని 100శాతం పెంచాలంటూ యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలను ట్రంప్ కోరినట్లు తెలుస్తోంది.
యుక్రెయిన్ యుద్ధం ముగించే అంశంపై డొనాల్డ్ ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రష్యాపై ఒత్తిడి పెంచేందుకు భారత దేశాన్ని ట్రంప్ టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా.. రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై సీనియర్ అమెరికన్, ఈయూ అధికారులు వాషింగ్టన్ లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఈయూ అధికారులతో ట్రంప్ కాన్ఫరెన్సు కాల్ లో మాట్లాడారు.
యుక్రెయిన్ పై దాడిని కొనసాగిస్తున్న రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి పెంచాలంటే భారత్, చైనా దేశాలపై 100శాతం సుంకాలు విధించాలని, రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తామని రష్యా, భారత్ చెప్పే వరకు వారిపై సుంకాల మోత మోగించాలని ట్రంప్ పేర్కొన్నట్లు తెలిసింది.
అయితే, అమెరికా సూచనలు అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈయూ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో భారత్, చైనా వంటి దేశాలపై ద్వితీయ ఆంక్షలు విధిస్తే నెలకొనే పరిణామాలపై వారు చర్చలు జరుపుతున్నారట. ఈ మేరకు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొన్నట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి.
భారతదేశం ఉత్పత్తులపై ఇప్పటికే ట్రంప్ 50శాతం సుంకాలను విధించారు. చైనా ఎగుమతులపై సుంకాలు 30శాతం వరకు ఉన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా మరోసారి భారత్, చైనాలపై సుంకాల మోతను మోగించే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









