లాజిస్టిక్స్, గిడ్డంగుల ఏర్పాటుకు రాష్ట్రానికి రండి

- October 23, 2025 , by Maagulf
లాజిస్టిక్స్, గిడ్డంగుల ఏర్పాటుకు రాష్ట్రానికి రండి

దుబాయ్: షరాఫ్‌ గ్రూప్ వైస్ ఛైర్మన్, షరాఫ్ డీజీ సంస్థ వ్యస్థాపకుడు షరాఫుద్దీన్ షరాఫ్‌తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలపై షరాఫ్‌తో చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మౌలిక వసతులు, మావన వనరుల లభ్యత, అలాగే ఇతర అనుకూలతల గురించి వివరించారు. బుధవారం యూఏఈలో తొలిరోజు పర్యటనలో భాగంగా షరాఫ్ గ్రూప్ వైస్ చైర్మన్‌తో సమావేశమైన సీఎం...ఆంధ్రప్రదేశ్‌లో లాజిస్టిక్స్ ప్రాజెక్టుల ఏర్పాటు గురించి ప్రధానంగా చర్చించారు. షరాఫ్ గ్రూప్‌ ఇప్పటికే భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో లాజిస్టిక్స్‌ పార్కులను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ఏపీ చేపట్టిన పారిశ్రామిక కారిడార్లలో ఆధునిక లాజిస్టిక్స్‌ పార్క్‌లు, గిడ్డంగులు స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. దీనికి ఆసక్తి చూపిన షరాఫ్ గ్రూప్ తమ అనుబంధ సంస్థ అయిన హింద్ టెర్మినల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో లాజిస్టిక్స్, గిడ్డంగి సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరిచింది. ఇందుకోసం రైల్వే, పోర్ట్ అనుసంధానం కలిగిన ప్రాంతాన్ని గుర్తించాలని షరాఫ్ గ్రూప్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

అవసరమైతే పాలసీల్లో మార్పులు చేస్తాం

‘మా రాష్ట్రంలో పోర్టులు, నేషనల్ హైవేలు విస్తారంగా ఉన్నాయి. కార్గో రవాణాకు రాష్ట్రం అనుకూలం. మేం ఇప్పుడు కొత్త పాలసీలు తెచ్చాం. రాష్ట్రానికి మేలు జరుగుతుందనుకుంటే పాలసీల్లో మార్పులు తేవడానికి సిద్దం. లాజిస్టిక్స్‌పై 14 శాతం ఖర్చు పెడుతున్నాం. దీన్ని 8 నుంచి 9 శాతానికి తగ్గించాలని చూస్తున్నాం. ఇందుకోసం పోర్టులు, జాతీయ రహదారులు, రైల్వే, రహదారి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. లాజిస్టిక్ వ్యయం తగ్గించడానికి సహకరించండి. రాయలసీమలో ఆటోమొబైల్ పరిశ్రమలు వస్తున్నాయి. నవంబర్ 14,15 తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడిదారుల సదస్సుకు హాజరుకండి.’ అని షరాఫ్ గ్రూప్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి అన్నారు. దీనికి స్పందించిన ఆ సంస్థ ప్రతినిధులు భారత్‌లో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నామని, ఆంధ్రప్రదేశ్‌కు తప్పనిసరిగా వస్తామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com