భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం

- October 31, 2025 , by Maagulf
భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం

అమెరికా: భారతదేశం మరియు అమెరికా మధ్య రక్షణ రంగంలో కొత్త మైలురాయి చేరుకుంది. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరియు అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ “డిఫెన్స్ కోఆపరేషన్ ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్”పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం పదేళ్లపాటు అమలులో ఉండనుంది. దీని ద్వారా ఇరు దేశాల మధ్య సాంకేతిక, వ్యూహాత్మక, భద్రతా రంగాల్లో మరింత బలమైన సహకారం కొనసాగనుంది. కౌలాలంపూర్‌లో జరిగిన సమావేశంలో ఇరు దేశాల ప్రతినిధి బృందాలు పాల్గొని వివిధ అంశాలపై చర్చించాయి.

ఈ సందర్భంగా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, “భారత్–అమెరికా రక్షణ సంబంధాలు మన ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రధాన స్థంభం. ఈ ఒప్పందం భవిష్యత్తులో మన రక్షణ సహకారానికి మార్గదర్శకంగా ఉంటుంది” అని అన్నారు. ఆయన మరింతగా వివరిస్తూ, ఉమ్మడి సైనిక సాధనాలు, సాంకేతిక మార్పిడి, రక్షణ ఉత్పత్తి రంగాల్లో భాగస్వామ్యం ద్వారా ఇరు దేశాలు పరస్పర భద్రతను బలోపేతం చేసుకోగలవని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా భారత్‌లో రక్షణ పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయని, స్వదేశీ రక్షణ ఉత్పత్తి దిశలో ఇది ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, స్వేచ్ఛాయుత నావిగేషన్, మరియు నియమాల ఆధారిత వ్యవస్థను కాపాడటంలో భారత్–అమెరికా భాగస్వామ్యం కీలక పాత్ర పోషించనుందని ఇరు దేశాలు స్పష్టం చేశాయి. చైనా విస్తరణవాద చర్యల నేపథ్యంలో ఈ ఒప్పందం వ్యూహాత్మకంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. క్వాడ్ దేశాల మధ్య ఉన్న సహకారానికి ఇది మరింత బలాన్ని చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే దశాబ్దంలో భారత్–అమెరికా రక్షణ సంబంధాలు సాంకేతికంగా, వ్యూహాత్మకంగా మరింత ఉన్నతస్థాయికి చేరే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com