ఇళ్లల్లో పని చేసే వారి కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా

- July 25, 2016 , by Maagulf
ఇళ్లల్లో పని చేసే వారి కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా

ఇళ్లల్లో పని చేసే వారి కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాన్ని కేంద్రం ప్రారంభించనుంది. తొలుత హైదరాబాద్‌, దిల్లీలో పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు చేస్తారు. కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ పథకాన్ని ఆగస్టులో ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద యజమానులు నెలకు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. బీమా రక్షణలో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి కుటుంబసభ్యుల చికిత్సకు అయ్యే వ్యయంపై గరిష్ఠ పరిమితి ఉండదు. పనిమనుషులు, డ్రైవర్లు, సంరక్షకులు, వంటమనుషులు తదితరులకు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా రక్షణ ఉంటుంది. ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో, డిస్పెన్సరీల్లో వారికి చికిత్స లభిస్తుంది. బీమా లబ్ధిదారులకు నగదు ప్రయోజనాలేమీ ఉండవు. క్రమంగా ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తారు. జాతీయ పథకంగా విస్తరించిన తర్వాత దాదాపు 80లక్షల మందికి ఆరోగ్య బీమా రక్షణ లభిస్తుందని కార్మిక మంత్రిత్వశాఖలోని ఒక అధికారి వెల్లడించారు. యజమానుల చెల్లింపు స్వచ్ఛందమేనని ఆ అధికారి చెప్పారు. వంటగ్యాస్‌ రాయితీని సంపన్నులు స్వచ్ఛందంగా వదిలేసుకోవాలని విజ్ఞప్తి చేసిన తరహాలోనే ఈ పథకం కింద యజమానులు తమ ఇంటిలో పని చేసే వారి బీమా కోసం చెల్లించాలని తర్వాత ప్రధాని మోదీ, మంత్రి దత్తాత్రేయ విజ్ఞప్తి చేస్తారని ఆ అధికారి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com