జపాన్‌లో చరిత్ర సృష్టించిన సనాయే తకైచి

- February 09, 2026 , by Maagulf
జపాన్‌లో చరిత్ర సృష్టించిన సనాయే తకైచి

జపాన్ రాజకీయాల్లో ఓ మహిళ చరిత్ర సృష్టించింది. 2025 అక్టోబర్‌లోనే ఆ దేశపు మొదటి మహిళా ప్రధాన మంత్రి సనాయే తకైచి(Sanae Takaichi) బాధ్యతలు చేపట్టారు. తన పదవీకాలం ప్రారంభమైన కొద్ది నెలలకే ఆమె ఖాతాలో మరో విజయం వేసుకుంది. 2026 ఫిబ్రవరి 8న జపాన్‌లో జరిగిన స్నాప్ ఎన్నికల్లో ఆమె లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. లోయర్ హౌస్‌లో సూపర్ మెజారిటీ సాధించింది. పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ NHK వెల్లడించిన వివరాల ప్రకారం, మొత్తం 465 సీట్లున్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో LDP ఒంటరిగానే 316 సీట్లు గెలుచుకుంది. ఇది సాధారణ మెజారిటీ మార్కు (233) కంటే ఎంతో ఎక్కువ. మిత్రపక్షమైన జపాన్ ఇన్నోవేషన్ పార్టీ (JIP)తో కలిపి ఈ కూటమి మొత్తం 352 సీట్లను కైవసం చేసుకుంది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌లో ఒకే పార్టీకి ఇన్ని సీట్లు రావడం ఇదే ఫస్ట్ టైం. 2017లో దివంగత నేత షింజో అబే సాధించిన రికార్డును కూడా సనాయే తకైచి అధిగమించారు. తకైచి విజయంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ‘X’ వేదికగా స్పందించారు. “మీ మైలురాయి విజయానికి అభినందనలు. భారత్-జపాన్ గ్లోబల్ భాగస్వామ్యం ప్రపంచ శాంతికి, స్థిరత్వానికి కీలకం. మీ నాయకత్వంలో మన స్నేహం మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని విశ్వసిస్తున్నాను” అని ప్రశంసించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు తెలపడం విశేషం. 2025 అక్టోబర్ 21న తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తకైచి, కేవలం 110 రోజుల్లోనే సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. “ప్రజల పూర్తి మద్దతు లేకుండా పాలన కొనసాగించడం ప్రజాస్వామ్యం కాదు” అని ఆమె పేర్కొన్నారు. ఒకవేళ ఓడిపోతే రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. ఆమె తెగువకు జపాన్ ప్రజలు నీరాజనం పట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com