భారత్కు ట్రంప్ షాక్..
- February 25, 2026
అమెరికా: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో వాణిజ్య యుద్ధాన్ని మొదలుపెట్టారు. తాజాగా భారత్ నుంచి దిగుమతి అయ్యే సోలార్ ఎనర్జీ ఉత్పత్తులపై ఏకంగా 126 శాతం ప్రాథమిక సుంకాన్ని విధిస్తూ ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం భారత్పైనే కాకుండా, ఇండోనేషియాపై 86% నుంచి 143% వరకు, లావోస్పై 81% సుంకాలను అమెరికా వాణిజ్య శాఖ ఖరారు చేసింది. ఆయా దేశాల ప్రభుత్వాలు తమ సోలార్ కంపెనీలకు భారీగా రాయితీలు ఇస్తున్నాయని, దీనివల్ల అమెరికాలోని స్థానిక కంపెనీలు నష్టపోతున్నాయన్న కారణంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అటు సోలార్ ఉత్పత్తుల తయారీదారులకు, ఇటు వినియోగదారులకు భారంగా మారనుంది. స్థానిక అమెరికన్ కంపెనీలను ఆదుకోవడమే ఈ సుంకాల లక్ష్యమని చెబుతున్నప్పటికీ, దీనివల్ల సోలార్ ప్యానెళ్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే క్లీన్ ఎనర్జీ అంటే పెద్దగా ఇష్టం లేని ట్రంప్, ఈ సుంకాల ద్వారా సోలార్ ఇండస్ట్రీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది అమెరికాలోని సోలార్ ప్రాజెక్టుల వ్యయాన్ని భారీగా పెంచే ప్రమాదం ఉంది. గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ సుంకాలు ట్రంప్ గతంలో ప్రకటించిన గ్లోబల్ టారిఫ్లకు అదనపు భారం. గత వారమే అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ గ్లోబల్ టారిఫ్లను రద్దు చేసినప్పటికీ, ఆయన వెనక్కి తగ్గకుండా 10 శాతం కొత్త టారిఫ్లను విధించారు. అవసరమైతే వీటిని 15 శాతానికి పెంచుతానని కూడా హెచ్చరించారు. ఈ నెల ప్రారంభంలోనే భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకున్న ట్రంప్, ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో సుంకాలు విధించడం ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలపై ప్రభావం చూపేలా ఉంది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. 2025 మొదటి ఆరు నెలల్లో అమెరికాకు అందిన సోలార్ మాడ్యూల్స్లో 57 శాతం వాటా భారత్, ఇండోనేషియా, లావోస్లదే కావడం విశేషం. 2024లో భారత్ నుంచి అమెరికాకు జరిగిన సోలార్ దిగుమతుల విలువ దాదాపు 792.6 మిలియన్ డాలర్లు. ఇది 2022తో పోలిస్తే తొమ్మిది రెట్లు ఎక్కువ. తాజాగా విధించిన 126 శాతం సుంకాల వల్ల భారతీయ సోలార్ కంపెనీలకు అమెరికా మార్కెట్ దాదాపు మూసుకుపోయినట్లేనని సిటీ బ్యాంక్ విశ్లేషకుడు విక్రమ్ బాగ్డీ అభిప్రాయపడ్డారు. అమెరికన్ సోలార్ గ్రూపులు తమ దేశ తయారీ రంగాన్ని కాపాడుకోవడానికి ఈ సుంకాలు తప్పనిసరని వాదిస్తున్నాయి.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









