ఏపీ కేబినెట్ సమావేశాలకు కొత్త రూల్స్

- April 14, 2026 , by Maagulf
ఏపీ కేబినెట్ సమావేశాలకు కొత్త రూల్స్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గ సమావేశాల నిర్వహణలో పారదర్శకత, సమయ పాలనను పెంచే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర కేబినెట్ ఎజెండా తయారీ, మెమోల సమర్పణకు సంబంధించి నూతన టైమ్స్ ను విధిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై కేబినెట్ సమావేశం జరగడానికి ఒకరోజు ముందు ఉదయం 11 గంటల లోపు అన్ని శాఖల మంత్రులు/అధికారులు తమ ప్రతిపాదనలను సమర్పించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చే ఎటువంటి ప్రతిపాదనలను ఎజెండాలో చేర్చబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం, ముఖ్యమంత్రి ఆమోదంతో కేబినెట్ ఎజెండాను ఫైనలైజ్ చేస్తారు. అత్యంత అసాధారణమైన లేదా అత్యవసరమైన అంశాలను మాత్రమే ముఖ్యమంత్రి అనుమతితో టేబుల్ ఐటమ్స్ గా చివరి నిమిషంలో చర్చకు అనుమతిస్తారు. ప్రభుత్వ రహస్యాల భద్రత, పారదర్శకతను దృష్టిలో ఉంచుకుని, ఎజెండా పంపిణీ విధానంలో పెను మార్పులు చేశారు.

ఇకపై కేబినెట్ ఎజెండాను వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా గ్రూపుల ద్వారా పంపిణీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి సమాచారాన్ని ఈ క్యాబినేట్ పోర్టల్ ద్వారా మాత్రమే మంత్రులకు, సంబంధిత అధికారులకు అందుబాటులో ఉంచుతారు. గతంలో ఎజెండా తయారీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఈ కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చారు. దీనివల్ల మంత్రులకు కూడా చర్చించాల్సిన అంశాలపై ముందుగానే పూర్తి అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది. పాలనలో వేగం పెంచడం, సాంకేతికతను జోడించడం ద్వారా నిర్ణయాల ప్రక్రియను మరింత పటిష్టం చేయడమే ఈ మార్పుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. అన్ని శాఖల కార్యదర్శులు ఈ నూతన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం మెమోలో ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com