డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్

- May 21, 2026 , by Maagulf
డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్

హైదరాబాద్: ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ సంస్థలోని బోధి పెవిలియన్‌లో పోలీసు, అగ్నిమాపక, హైడ్రా, మున్సిపల్ కార్పొరేషన్ల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ అరికట్టడం, ప్రకృతి విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, సంబంధిత శాఖల వ్యవస్థల ఆధునీకరణపై సమగ్ర అధ్యయనం చేసి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేక డీ-అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్ క్రైమ్ నియంత్రణపై ప్రత్యేక అధ్యయనం నిర్వహించి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని, పోలీసు శిక్షణ దశ నుంచే సైబర్ క్రైమ్ విభాగానికి ప్రత్యేక ఎంపిక విధానం ఉండాలని పేర్కొన్నారు.

అన్ని శాఖలు, ఉన్నతాధికారుల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని సూచించారు. విజిలెన్స్ విభాగంలో సాంకేతిక వినియోగాన్ని పెంచి, డేటా అనాలసిస్ ఆధారంగా వ్యవస్థీకృత నేరాలపై దృష్టి సారించాలని తెలిపారు. విజిలెన్స్ విభాగానికి మరిన్ని అధికారాలు కల్పించే అంశాన్ని కూడా అధ్యయనం చేయాలని సూచించారు.

అగ్ని ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కాకుండా, ప్రమాదాల నివారణపై ఫైర్ డిపార్ట్‌మెంట్ ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మున్సిపల్ శాఖ, హైడ్రాతో సమన్వయం చేసుకుని జూన్ 15లోగా అగ్నిమాపక శాఖ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

నాలాల నిర్వహణలో మెట్రో వాటర్ వర్క్స్ శాఖతో సమన్వయం అవసరమని, మ్యాన్ హోల్స్ నిర్వహణలో పోలీసు, ట్రాఫిక్ పోలీసు, హైడ్రా, మున్సిపల్ శాఖలు కలిసి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

నగరంలో అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవడంలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఫ్లెక్సీల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com