ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- July 08, 2026
షార్జా నుంచి కరాచీ కి బయలుదేరిన ఒక పాకిస్థాన్ కార్గో విమానం ఐదుగురు సిబ్బందితో సహా అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది.నిన్న రాత్రి అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తుండగా ఈ బోయింగ్ 737 విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు కోల్పోయింది. నావిగేషన్ వ్యవస్థ లో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ సమాచారం ఇచ్చిన కొద్ది నిమిషాలకే ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో పాకిస్థాన్ అధికారులు వెంటనే వివిధ ఏజెన్సీలతో కలిసి సముద్రంలో భారీ గాలింపు చర్యలు చేపట్టారు.
పాకిస్థాన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం..కే2 ఎయిర్వేస్ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన ఈ విమానం పాక్ కాలమానం ప్రకారం రాత్రి 9:18 గంటలకు నావిగేషన్ సమస్య గురించి కరాచీ ఏటీసీకి తెలిపింది. ఏటీసీ అధికారులు విమానానికి మార్గనిర్దేశం చేసే ప్రయత్నంలో ఉండగానే, కేవలం మూడు నిమిషాల తర్వాత విమానం వేగంగా కిందకు పడిపోతున్నట్లు రాడార్లో నమోదైంది. కరాచీకి పశ్చిమంగా 287 కిలోమీటర్ల దూరంలో బలూచిస్థాన్లోని ఓర్మారా తీరానికి సమీపంలో ఈ ఘటన జరిగింది.
ప్రముఖ విమానయాన ట్రాకింగ్ సంస్థ ‘ఫ్లైట్రాడార్ 24’ విశ్లేషణ ప్రకారం.. విమానం గాల్లో పలుమార్లు ఎత్తును కోల్పోయి, మళ్లీ పైకి లేచి, ఆ తర్వాత ఒక్కసారిగా సముద్రం వైపు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. సంబంధాలు తెగిపోయే ముందు విమానం కేవలం 1,100 అడుగుల ఎత్తులో ఉందని, నిమిషానికి 22,400 అడుగుల అసాధారణ నిలువు వేగంతో కిందకు పడిపోయిందని డేటా సూచిస్తోంది. ఈ వేగం విమానం నియంత్రణ కోల్పోయి కూలిపోయిందనే వాదనకు బలం చేకూరుస్తోంది.
అదృశ్యమైన ఈ విమానం 27 ఏళ్ల నాటి బోయింగ్ 737-400. కే2 ఎయిర్వేస్ సంస్థ నిర్వహిస్తున్న ఏకైక విమానం కూడా ఇదే. ఈ విమానాన్ని 2024లో సేవల్లోకి తీసుకువచ్చారు. ఇది మొదట 1999లో ప్యాసింజర్ విమానంగా సేవలు అందించి, 2012లో కార్గో విమానంగా మార్పు చెందింది. ప్రస్తుతం విమాన శకలాల కోసం, సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







