జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!

- July 20, 2026 , by Maagulf
జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!

మస్కట్: ప్రాంతీయ భద్రత, స్థిరత్వంపై నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బద్ర్ బిన్ హమద్ అల్ బుసైదీ.. జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో వేర్వేరుగా టెలిఫోన్‌ ద్వారా చర్చలు జరిపారు.

మొదట జోర్డాన్ ఉప ప్రధాని, విదేశాంగ మరియు ప్రవాసీ వ్యవహారాల మంత్రి అయ్‌మన్ సఫాదీ తో మాట్లాడిన అల్ బుసైదీ.. ప్రాంతీయ పరిణామాలు మరియు వాటి ప్రభావంపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు రాజకీయ ప్రయత్నాలను మరింత వేగవంతం చేయాలని, దౌత్య, శాంతియుత పరిష్కారాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. అలాగే, అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం, సముద్ర రవాణా స్వేచ్ఛను పరిరక్షించడం, అన్ని దేశాల ప్రయోజనాలను కాపాడడం, దేశాల సార్వభౌమత్వం, స్థిరత్వాన్ని నిలబెట్టడం అత్యంత ముఖ్యమని వారు పేర్కొన్నారు.

అనంతరం ఖతార్ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో కూడా ఒమాన్ విదేశాంగ మంత్రి  చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పరిస్థితులు, ఉద్రిక్తతలను తగ్గించేందుకు కొనసాగుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలు, సంబంధిత పక్షాల మధ్య అవగాహనకు దోహదపడే చర్యలపై చర్చించారు. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి గుండా నౌకాయాన స్వేచ్ఛ,  ప్రపంచ సఫ్లై చైన్ లను సాధారణ స్థితికి తీసుకురావడం అవసరమని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిణామాలపై పరస్పర సంప్రదింపులు కొనసాగించడంతో పాటు, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమన్వయంతో ఉద్రిక్తతలకు మూల కారణాలను పరిష్కరించి శాంతిని నెలకొల్పాల్సిన అవసరాన్ని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com