ఉగ్రవాదంపై పోరాడేందుకు కలసికట్టుగా విస్తృత ప్రయత్నాలు చేయాలి - మోడీ
- September 05, 2016
ఉగ్రవాదంపై పోరాడేందుకు కలసికట్టుగా విస్తృత ప్రయత్నాలు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన చైనాలోని హాంగ్జౌలో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాధినేతల సమావేశంలో ప్రసంగిస్తూ, ఉగ్రవాదులకు ఊతమిచ్చి, వారిని ప్రేరేపిస్తున్న దేశాలను ఏకాకులను చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఊతమిచ్చి వారిని ప్రోత్సహిస్తున్నాయి.
దక్షిణాసియాతో పాటు ప్రపంచంలోని ఎక్కడి ఉగ్రవాదులకైనా సరే నిధులు, ఆయుధాలు అందకుండా చూడాల్సిన అవసరం ఉంది.
దీనిని దృష్టిలో ఉంచుకుని ఉగ్రవాదంపై పోరాడేందుకు బ్రిక్స్ దేశాలు తమ ప్రయత్నాలను విస్తృతం చేయడంతో పాటు ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న దేశాలను ఏకాకులను చేసేందుకు కలసికట్టుగా చర్యలు చేపట్టాలి' అని మోడీ పునరుద్ఘాటించారు.
ప్రపంచంలో ఉగ్రవాదానికి ప్రధాన కేంద్రంగా ఉన్న దాయాది దేశం పాకిస్తాన్ను ఉద్ధేశించి ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో బ్రిక్స్కు ఎంతో పలుకుబడి ఉందని, కనుక వర్థమాన దేశాలు తమ అభివృద్ధి లక్ష్యాలను అందుకునే విధంగా అంతర్జాతీయ అజెండాకు రూపమివ్వడం బ్రిక్స్ సభ్య దేశాల ఉమ్మడి బాధ్యత అని మోడీ పేర్కొన్నారు.
అస్థిరతకు మూల కారణంగా ఉన్న ఉగ్రవాదం వివిధ మార్గాల ద్వారా మరింత విస్తరిస్తుండటం మన సమాజాలకు, దేశాలకు అతిపెద్ద ముప్పుగా పరిణమించిందని, ముఖ్యంగా ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటుండటం ఈ ముప్పును మరింత పెంచుతోందని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు
భారత్ ఆందోళన
పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా నిర్మిస్తున్న చైనా- పాక్ ఆర్థిక కారిడార్, అలాగే పాకిస్తాన్ భూభాగంనుంచి కొనసాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలపై భారత దేశం తన ఆందోళనను చైనాకు తెలియజేసింది. హాంగ్ఝౌలో జరుగుతున్న జి-20 దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం కోసం ఇక్కడికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో సమావేశమయ్యారు.
భారత్, చైనాలు పరస్పర ఆకాంక్షలు, ఆందోళనలను గౌరవించుకుంటూనే ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మోడీ జీ జిన్పింగ్కు తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరు విషయంలో రాజకీయ ఆకాంక్షలు అడ్డుకాకూడదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాలు కూడా పరస్పర ఆకాంక్షలు, ఆందోళనలు, వ్యూహాత్మక ప్రయోజనాలను గౌరవించుకుంటూనే ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవలసిన అవసరం ఎంతయినా ఉందని మోడీ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా 4600 కోట్ల డాలర్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (సిపిఇసి) పట్ల మన దేశం ఆందోళనను మోడీ తెలియజేశారు. ఈ కారిడార్లో రైలు రోడ్డు మార్గాలతో పాటుగా అరేబియా సముద్రంలోని గ్వాడార్ పోర్టునుంచి చైనాలోని ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే జిన్జియాంగ్ రాష్ట్రానికి ముడిచమురు, గ్యాస్ను తరలించడం కోసం పైప్లైన్లను నిర్మాణం చేయనున్నారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్నుంచి కొనసాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల గురించి కూడా చర్చల్లో ప్రస్తావించడం జరిగిందా అన్న విలేఖరుల ప్రశ్న కు విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ సమాధానమిస్తూ, సమావేశం లో ఈ అంశాన్ని లేవనెత్తినట్లు చెప్పారు.
చైనా అధ్యక్షుడికి బహుమతులు: మోడీకి కితాబు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం చైనా అధ్యక్షుడికి పలు బహుమతులను అందజేశారు. వీటిలో చైనా చిత్రకారుడు రూపొందించిన మోడీ తైలవర్ణ చిత్రం (ఆయిల్ పెయింటింగ్) తో పాటు చైనా భాషలోకి తర్జు మా చేసిన భగవద్గీత, పురాతన భారతీయ గ్రంథాలు, స్వామి వివేకానందుడి విశిష్టతను తెలియజేసే వ్యాసాలు ఉన్నాయి.
జి-20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు శనివారం ఇక్కడికి చేరుకున్న మోడీ చైనా భాషలోకి ప్రొఫెసర్ వాంగ్ జిచెంగ్ తర్జుమా చేసిన పది పురాతన భారత గ్రంథాలను జిన్పింగ్కు బహూకరించారు.
భారత సంస్కృతీ, సంప్రదాయలను అమితంగా ప్రేమించే వాంగ్ జిచెంగ్ ప్రతిష్ఠాత్మక పెకింగ్ విశ్వవిద్యాలంలో హిందీ బోధకుడిగా పనిచేస్తున్నారు. జిన్పింగ్కు మోడీ బహూకరించిన గ్రంథాల్లో యోగ విద్య విశిష్ఠతను తెలియజేసే గ్రంథంతో పాటు పతంజలి యోగ సూత్రాలు, నారదుడి భక్తి సూత్రాలకు సంబంధించిన గ్రంథాలున్నాయని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు.
కాగా, భారత ఆర్థిక విధానాల్లో మోడీ నాయకత్వాన్ని జిన్ పింగ్ కొనియాడారు. ముఖ్యంగా మోడీ ఎనర్జీ పాలసీని మెచ్చుకున్నారు. ఇది ఇలా ఉండా, భారత్ ఎన్ఎస్జీ సభ్యత్వానికి తాము ఎప్పుడూ మద్దతుగానే ఉంటామని జపాన్ ప్రకటించింది.
బ్రిటన్ ప్రధానితో మోడీ భేటీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్ నూతన ప్రధాని థెరిస్సా మేతో భేటీ అయ్యారు. బ్రెగ్జిట్ అనంతరం బ్రిటన్ కొత్త ప్రధానమంత్రితో మోడీ సమావేశమవడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగశాఖ మీడియా ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సమావేశంలో ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం మోడీ చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న జీ20 సదస్సుకు హాజరయ్యారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగాక బ్రిటన్ ప్రధాని పదవి నుంచి డేవిడ్ కామెరూన్ తప్పుకున్నారు. దీంతో జులై 13న థెరిసా నూతన ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









